రూ.1కే నీటి కనెక్షన్
Published Saturday, 30 July 2016హైదరాబాద్, జూలై 29: దారిద్ర రేఖకు దిగువనున్న (బిపిఎల్) కుటుంబాలకు ఒక్క రూపాయికే వాటర్ కనెక్షన్ అందించేందుకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఫుడ్ సెక్యూరిటీ కార్డులు కలిగిన వారికి, బిపిఎల్ కార్డులు కలిగిన పేద ప్రజలకు కేవలం రూపాయికే నీటి కనెక్షన్ను ప్రభుత్వం ఇవ్వనుంది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి నల్లా పథకంలో భాగంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అడుగులు ముందుకు వేస్తోంది. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్లో నీటి కనెక్షన్ కలిగిన డొమెస్ట్రిక్ వినియోగదారులకు నీటి బిల్లులను కూడా మాఫీ చేసిన సంగతి విధితమే. ఇది ఇలా ఉండగా గ్రేటర్ హైదరాబాద్కు ఆనుకుని ఉన్న గ్రామాల్లో నీటి సౌకర్యాన్ని మెరుగు పర్చేందుకు రూ.1900 కోట్ల వ్యయంతో పనులు చేపడుతోంది. నూతన నీటి పైప్లైన్ నిర్మాణంతో పాటు దాదాపు 58 రిజర్వాయర్లను వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్మిస్తోంది. అందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. శివారు మున్సిపాల్టీ, గ్రామాలలో నీటి సౌకర్యం కల్పించేందుకు చేపడుతున్న పనులకు సంబంధించి ప్రతి రోజు జలమండలి ప్రాజెక్ట్ విభాగం అధికారులతో సంస్థ ఎండి ఎప్పటికపుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. రూపాయికే నీటి కనెక్షన్ ఇవ్వడం పట్ల అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.