మీకు 10 వేల జీతం సరిపోదా?
Published Saturday, 30 July 2016వికారాబాద్, జూలై 29: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 12 రోజులుగా సమ్మె చేస్తున్న ఏఎన్ఎంలు శుక్రవారం వికారాబాద్ అర్అండ్బి అతిథిగృహానికి వచ్చిన రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతామహేందర్రెడ్డి, శాసనసభ్యుడు బి.సంజీవరావులకు వినతిపత్రం ఇచ్చారు. సమస్యల్లో ఒకటైన వేతనాలు పెంచాలని ఏఎన్ఎంలు కోరడంతో స్పందించిన జడ్పీచైర్పర్సన్ పది వేల రూపాయల వేతనం సరిపోదా అంటూ ప్రశ్నించారు. జీవో నెంబరు 14 ప్రకారం 10వ పిఆర్సిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అంతకంటే వేతనం పెంచే పరిస్థితి లేదని స్పష్టం చేయడంతో ఏఎన్ఎంలు డౌన్ డౌన్ అంటూ నినాదాలిచ్చారు. ఈసందర్భంగా ఏఎన్ఎంల డివిజన్ అధ్యక్షురాలు పి.అనిత, శోభారాణి మాట్లాడుతూ ఏఎన్ఎంలు ఏమి పనిచేస్తారో జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యేలకు తెలియని పరిస్థితి దాపురించిందని వాపోయారు. కార్మిక చట్టాల పట్ల ఎమ్మెల్యే, మంత్రులకు అవగాహన లేదని విమర్శించారు. ప్రజాప్రతినిధులు ఆలోచనలేని విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం యూనియన్ నాయకులతో మాట్లాడి సమ్మె ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం చేపట్టే జిల్లా కలెక్టరేట్ ముట్టడిని ఏఎన్ఎంలు జయప్రదం చేయాలని కోరారు. సమ్మెకు సిఐటియు నాయకుడు మహిపాల్, అశోక్, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆశలత, రాగిణి, గీత, ఎస్ఎఫ్ఐ నాయకుడు యాదయ్య, వై.మహేందర్ మద్దతు పలకగా ఏఎన్ఎంలు లలిత, స్నేహలత, సులోచన, విజయలక్ష్మి, అనంతమ్మ, అంజలి, పుష్ప, పాపమ్మ, నాగమణి, సులోచన, సుజాత పాల్గొన్నారు.