సరదా కోసం చేసే ర్యాగింగ్తో ఉజ్వల భవిష్యత్ నాశనం
Published Saturday, 30 July 2016ఘట్కేసర్, జూలై 29: సరదాకోసం చేసే ర్యాగింగ్తో విద్యార్థినీ విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారని సైబరాబాద్ తూర్పు కమిషనర్ ఆఫ్ పోలీసు మహేష్భగవత్ అన్నారు. మండల పరిధి వెంకటాపూర్లోని అనురాగ్ విద్యాసంస్థలో శుక్రవారం జరిగిన యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సులో సిపి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకుని సాధించేవరకు విశ్రమించకుండా శ్రమించాలని సూచించారు. కళాశాలలో మొదటిసారిగా వచ్చినప్పుడు తాము కూడా ఇతరులతో ర్యాగింగ్కు గురయ్యామన్న విషయాన్ని మరచి సీనియర్లు కొత్తగా వచ్చిన విద్యార్థినీ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తున్నారని తెలిపారు. దీంతో కొంతమంది తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోకుండానే ఉజ్వల భవిష్యత్ను కోల్పోతున్నట్లు చెప్పారు. ర్యాగింగ్ ఒక్క భూతం లాంటిదని, అదిప్రారంభం అయితే ప్రాణాలను సైతం తీసుకుంటుందన్నారు. ర్యాగింగ్లకు పాల్పడితే కఠినమైన చట్టాలు ఉన్నాయని, కేసులు నమోదుఅయితే భవిష్యత్లో ఏదీ సాధించలేరని, కనీసం ఉద్యోగాలు లభించటం గాని, విదేశాలకు వెళ్లటం గాని జరగదన్నారు. ర్యాగింగ్ను అరికట్టేందుకు షీ టీంలను ఏర్పాటు చేశామని, ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని, కేవలం పది నిమిషాలలో షీ టీం సభ్యులు మీముందు ఉంటారని చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, గతంలో రాత్రి సమయాలలో మాత్రమే డ్రంకన్ డ్రైవ్ నిర్వహించేవారమని, నేడు పగలు కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి ప్రపంచ గుర్తింపు పొందాలని సూచించారు. విద్యార్థినీ విద్యార్థులందరూ సోదర భావంతో మెలుగుతూ ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ఒక్కరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలన్నారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి పరిశోధనలు జరపాలని, దీంతో తాము ఎదగటంతో పాటు దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చినట్టు అవుతుందన్నారు.
విద్యార్థులు చేసే పరిశోదనలకు కళాశాల యజమాన్యాలు నిరంతరం సహకరించాలని కోరారు. కళాశాల చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సమయాన్ని వృథా చేసుకోకుండా నిరంతరం శ్రమించాలని సూచించారు. చదువులో నైపుణ్యత కలిగిన ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని చెప్పారు. చదువుపై ఏకాగ్రత కలిగి ఉన్నవారికి ర్యాగింగ్లు గుర్తుకు రావని తోటి విద్యార్థులను సోదరభావంతో చూస్తారన్నారు. తాను ఎంచుకున్న లక్ష్యాన్ని సాదించుకునేందుకు ప్రయత్నించే విద్యార్థులకు తాము నిరంతరం సహకరిస్తామన్నారు.
కళాశాల చదువులు పూర్తిఅయ్యే లోపే నైపుణ్యత కలిగిన విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నట్టు చెప్పారు. అనంతరం కళాశాల ఆవరణలో సిపి మహేష్ భగవత్, కళాశాల చైర్మన్ పల్లారాజేశ్వర్రెడ్డి హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఇన్చార్జి డిసిపి రాంచంద్రారెడ్డి, ఏసిపి రవిచందన్రెడ్డి, ఘట్కేసర్ సిఐ ప్రకాష్, ఎస్సైలు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.