మండలంలో వెలసిన మావోయిస్టు పోస్టర్లు, కరపత్రాలు
Published Saturday, 30 July 2016చింతూరు, జూలై 29: మండలంలోని పేగ, సూరకుంట గ్రామాల మధ్య శుక్రవారం మావోయిస్టులు పోస్టర్లు, కరపత్రాలను వదిలి వెళ్లారు. ఈ పోస్టర్లు, కరపత్రాలు మావోయిస్టు శబరి ఏరియా కమిటీ, మావోయిస్టు తెలంగాణా రాష్ట్ర కమిటీ పేరున వెలిశాయి. వీటిలో జూలై 28నుంచి ఆగస్టు 3వ తేదీ వరకూ జరిగే మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను గ్రామగ్రామాల్లో నిర్వహించాలని పిలుపునిచ్చారు. అమరుల ఆశయాల వెలుగులో ప్రజాయుద్ధాన్ని తీవ్రతరం చేద్దామన్నారు. ఆపరేషన్ గ్రీన్హంట్, బహుముఖ మూడవ దారిని, దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారా తిప్పిగొడదామని పిలుపునిచ్చారు. ఒక వీరుడు మరణిస్తే వేల వీరులు పుట్టుకొస్తారని అన్నారు. అలాగే అమర వీరుల ఫొటోలతో కూడిన పోస్టర్స్ చెట్లకు అతికించారు.