సత్యదేవుని దత్తత శివాలయంలో వైభవంగా అష్టోత్తర శత కలశాభిషేకం
Published Saturday, 30 July 2016శంఖవరం, జూలై 29: అన్నవరం సత్యదేవుని దేవస్థానం దత్తత దేవాలయమైన శంఖవరంలోని శ్రీ పార్వతీ మల్లేశ్వర స్వామివార్ల ఆలయం (శివాలయం)లో అష్టోత్తర శత కలశాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అన్నవరం దేవస్థానం వేద పండితులు, శంఖవరం గ్రామస్థులు సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టారు. శివాలయ ప్రాంగణంలోగల మండపంలో అన్నవరం దేవస్థానానికి చెందిన ఘనాపాఠీలు కపిలవాయి రామశాస్ర్తీ, హనుమంతవర్జుల అమరేశ్వర అవధాని ఆధ్వర్యంలో వ్రత పురోహితులు నాగాభట్ల కామేశ్వరరావు, ముత్య సత్యనారాయణశర్మ, చళ్లపల్లి ప్రసాద్, అంగర సతీష్, చామర్తి వెంకటరెడ్డి పంతులు, గంగాధరభట్ల శ్రీనివాస్, గాడేపల్లి సత్యనారాయణ, చిట్టెం వాసు వైధిక బృందం వేద మంత్రోచ్ఛారణలతో అర్చకస్వాములు తొలుత విఘ్నేశ్వర పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఋష్యశృంగుడి గ్రామోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్లకు పుణ్యాహవాచనం, రుత్విగ్వరణ, రుష్యశృంగ ఆవాహన, ప్రతిష్ఠాపన, ప్రదక్షిణం, అష్టోత్తర శత కలశ ఆవాహన, శత అనువాక అభిమంత్రణ, మహాన్యాస, సహస్ర ఘటాభిషేకం, నీరాజన మంత్ర పుష్పములు, ఆశీర్వచనములు నిర్వహించారు. వరుణుడి కటాక్షం కోసం చేసిన ఈ అష్టోత్తర శత కలశాభిషేకంలో భాగంగా మూల విరాట్లైన శ్రీ పార్వతీ మల్లేశ్వరస్వామి వార్లకు పవిత్ర జలంతో సహస్ర ఘటాభిషేకం గావించారు. స్వామివారి అభిషేక కార్యక్రమంలో పాల్గొనేందుకు పలు ప్రాంతాల నుండి వేద పండితులు, అర్చక స్వాములు, పురోహితులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. స్వామి, అమ్మవార్ల అభిషేకాన్ని తిలకించేందుకు శంఖవరం, పరిసర గ్రామల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి, అమ్మవార్లను దర్శించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అభిషకంలో భాగంగా గ్రామానికి చెందిన భజన సంఘాలు చెక్క భజనలు, తాడిపెద్దు వద్ద తప్పెట గుళ్లాటలతో భక్తులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో అన్నవరం దేవస్థాన పర్యవేక్షణాధికారి ఎం తిరుమలేశ్వరరావు, కమిటీ సభ్యులు రాంపల్లి బ్రహ్మానందశర్మ, పర్వత శతృఘు్నడు, పడాల జోగారావు, మేకల కృష్ణ, పర్వత బాబ్జి, పిల్లా సూరిబాబు, విశేష సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.