రావులపాలెంలో గౌతమి ఘాట్కు అనుమతి
Published Saturday, 30 July 2016రావులపాలెం, జూలై 29: అంత్య పుష్కరాలకు సంబంధించి రావులపాలెం గౌతమి గోదావరి ఘాట్ ఏర్పాటుకు జిల్లా కలెక్టరు నుండి అనుమతులు లభించినట్టు శుక్రవారం రాత్రి సర్పంచ్ పోతుమూడి విజయలక్ష్మి, ఉప సర్పంచ్ కొవ్వూరి జగన్నాథరెడ్డి విలేఖరులకు తెలిపారు. మండలంలో ప్రధానమైన రావులపాలెం ఘాట్లో అంత్య పుష్కరాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్న వైనాన్ని, ఘాట్లో నెలకొని ఉన్న దుస్థితిపై ఆంధ్రభూమిలో ‘కనీస సౌకర్యాలూ కరవే’ శీర్షికన వెలువడిన కథనంపై సర్పంచ్, ఉప సర్పంచ్లు స్పందించారు. శుక్రవారం కాకినాడ వెళ్లి జిల్లా కలెక్టరును కలిశారు. వేలాది మంది స్నానాలు ఆచరించే రావులపాలెం ఘాట్లో ఏర్పాట్లు చేసేందుకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. దీంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఘాట్లో ఏర్పాట్లు చేసేందుకు కలెక్టరు అనుమతించారని, ఘాట్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారని సర్పంచ్, ఉపసర్పంచ్ తెలిపారు. ఇప్పటికే భక్తులు నదీ ప్రవాహం వద్దకు వెళ్లి స్నానాలు చేసేందుకు వీలుగా పంచాయతీ ఆధ్వర్యంలో బాట ఏర్పాటు చేశామన్నారు. అంతేగాకుండా ప్రవాహం వద్ద రెండు నావలు, వలలతో రక్షణ ఏర్పాట్లు చేస్తామన్నారు. అలాగే స్నానాలకు వచ్చే భక్తులకు పులిహోర, మంచినీటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. స్థానిక సిఆర్సీ ఆధ్వర్యంలో బాదంపాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఆఖరి రోజున గ్రామస్థులతో ఊరేగింపుగా గోదావరి వద్దకు చేరుకుని హారతి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. రోజుకు సుమారు 5 వేల మంది స్నానాలకు వచ్చే అవకాశం ఉందన్న అంచనాలతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.