నెల రోజులుగా ఆగిన జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ!
Published Saturday, 30 July 2016హిందూపురం టౌన్, జూలై 29 : మున్సిపాలిటీలో నెల రోజులుగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం లేదు. గతనెల 30వ తేదీన కమిషనర్ ఎవివి భద్రరావు పదవీ విరమణ చేయడంతో అప్పటి నుండి జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ పూర్తిగా నిలిచిపోయింది. సాధారణంగా పత్రాల జారీకి కమిషనర్ డిజిటల్ సంతకం చేయాల్సి ఉంటుంది. భద్రరావు పదవీ విరమణ చేయడంతో కమిషనర్ బాధ్యతలు తీసుకున్న వ్యక్తి పేర డిజిటల్ కీ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే 15 రోజుల పాటు ఇన్చార్జిగా ఎవరిని నియమించకపోవడం, తర్వాత నియమించినా వివిధ కారణాలతో డిజిటల్ కీని తీసుకోకపోవడంతో ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయింది. డిజిటల్ సంతకాన్ని ప్రజారోగ్య విభాగం అధికారులు ఉన్నతాధికారులను సంప్రదించి తీసుకురావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు డిజిటల్ సంతకం తేవకపోవడంతో జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ నిలిచిపోవడంతో ఆయా ధ్రువీకరణ పత్రాల కోసం బాధితులు ప్రతిరోజూ కార్యాలయం చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నారు. అయితే డిజిటల్ కీని అందించేందుకు ఉన్నతాధికారులు కూడా సహకరించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలన్నా, ఆధార్ ధ్రువీకరణ పొందాలన్న తదితర వాటి కోసం తప్పనిసరిగా జనన ధ్రువీకరపత్రాన్ని అడుగుతున్నారు. దీనికి తోడు చనిపోయిన వ్యక్తులకు సంబంధించి ఆయా కుటుంబాలు తమ ఆర్థిక లావాదేవీల కోసం ఖజానా, బ్యాంక్ తదితర వాటికి మరణ ధ్రువీకరపత్రాన్ని అందజేయాల్సి ఉంది. అయితే గత నెల రోజులుగా హిందూపురం మున్సిపాలిటీలో జనన, మరణ ధ్రువీకరపత్రాల జారీ జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో ఆయా ధ్రువీకరపత్రాల జారీ పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు అధికారులను సంప్రదించకుండా ఆన్లైన్లోనే దాదాపు 200 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ధృవీకరణ పత్రాల కోసం మీ సేవ కేంద్ర నిర్వాహకులను సంప్రదిస్తున్నారు. వారు ఇదిగో, అదిగో అంటూ చెబుతున్నారు. కాగా శనివారం ఉదయం 11 గంటలకు చైర్పర్సన్ రావిళ్ళ లక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జి కమిషనర్ రమేష్ తెలిపారు. కౌన్సిలర్లతోపాటు అన్ని విభాగాల అధికారులు తప్పకుండా హాజరు కావాలని ఆయన కోరారు.