నగరంలో మంత్రి ఆకస్మిక తనిఖీ
Published Saturday, 30 July 2016కడప,జూలై 29: జిల్లా ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం జిల్లాపర్యటన సందర్భంగా నగరంలో కలియతిరిగారు. కడప జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి 92.6మి.మీ.వర్షం కురవడంతో రవీంద్రనగర్, పాతబస్టాండు, గుంతబజార్, మృత్యుంజయకుంట, జయనగర్ కాలనీ, గౌస్నగర్, చిన్నచౌకు, బుడగజంగంకాలనీ తదితర లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజిల్లో పారకుండా డ్రైనేజి నీరు, వర్షం నీరు రోడ్లపై పేరుకుపోయింది. మంత్రి నగర కమిషనర్, శానిటేషన్ సిబ్బంది, నగర పాలక అధికారులను వెంటపెట్టుకుని పలు ప్రాంతాల్లో పర్యటించారు. మంత్రి గంటా మరీ దగ్గరుండి డ్రైనేజి కాలువలపై పేరుకుపోయిన చెత్తాచెదారం, ఇరుక్కుపోయిన చెత్తను దగ్గరుండి తీయించారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు, కడప అసెంబ్లీ ఇన్చార్జి ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు), నగరంలోని అధికారులు, తెలుగుదేశం నాయకులను వెంటపెట్టుకుని మురుగునీరు నిలిస్తే అంటువ్యాధులు ప్రబలుతాయని శానిటేషన్ సిబ్బందిని అప్రమత్తం చేసి ఎక్కడ మురుగునీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు పనిచేసిన పనులు గురించి తెలుసుకున్నారు. అధికారులు, సిబ్బంది ఎవరు నిర్లక్ష్యం చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాను వారం రోజులు నగర పాలకంతోపాటు జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో పర్యటిస్తానని ప్రజలకు ఎటువంటి అంటువ్యాధులు ప్రబలినా అధికారులు బాధ్యత వహించాల్సివుంటుందని, వైద్యం, ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నా నిరుపయోగం అవుతోందని ఆయన అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మంత్రితోపాటు జెసి శే్వతతెవతియ, రాష్ట్ర, జిల్లా టిడిపి నేతలు ఎస్.గోవర్థన్రెడ్డి, సిఎం సురేష్నాయుడు, బి.హరిప్రసాద్, ఎస్.దుర్గాప్రసాద్, సుభాన్బాషా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.