దేశీయ విత్తనమే జాతికి పునాది
Published Saturday, 30 July 2016గుంటూరు, జూలై 29: దేశీయ విత్తనాలే భరత జాతి పునాదులని పలువురు ప్రముఖులు ప్రస్తుతించారు. విజయవాడ హరితభారతి ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో దేశీయ విత్తన సంబరాల్లో విత్తన ఉత్పాదకులు ప్రసంగించారు. కర్నాటకకు చెందిన జాతీయ్ బీజ్ మంచ్ నాయకుడు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తల్లిలాంటిది నేల అని అభివర్ణించారు. ఏ విత్తనాలు నాటితే అవే విత్తనాలనే అందిస్తుందని వివరించారు. విదేశీ విత్తనం కంటే సొంత విత్తనమే వ్యవసాయనికి లాభసాటి అన్నారు. మనదేశంలో పండించిన విత్తనాలే పునాది వంటివని, పునాది బలంగా ఉండేందుకే ఈ దేశీ విత్తన సంబరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం నిర్వహించిన హరిత భారతి ట్రస్టు నిర్వాకులు సిహెచ్ త్రినాథ్ను ఈ సందర్భంగా వక్తలు అభినందించారు. సుమారు రెండువేల మంది రైతులు సదస్సుకు హాజరయ్యారు. వక్తలు రైతులకు ఏ రాష్ట్రంలో ఏ విత్తనాలు వినియోగించాలనే అంశాలపై పలు సూచనలు చేశారు. రైతులకు హామీ పత్రం ద్వారా ఐదు రకాల దేశవాళీ వరి, కంది విత్తనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జాతీయ పత్తి సలహా సంఘం సభ్యుడు డాక్టర్ డి నరసింహారెడ్డి, జర్మనీలో పరిశోధనలు జరిపిన ఇంద్రసేనారెడ్డి, తమిళనాడుకు చెందిన దేశీ విత్తన ఉద్యమకారుడు భాస్కరన్, జయ చంద్రన్, రామస్వామి, సోంపేటకు చెందిన ఢిల్లీరావు, తదితరులు స్వదేశీ విత్తన విశిష్టతను వివరించారు.