ఆటంకాలు లేకుండా బాలల చలనచిత్ర ప్రదర్శనలు: జెసి
Published Saturday, 30 July 2016నెల్లూరు, జూలై 29: జిల్లాలో వచ్చే నెల 14 నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బాలల చలనచిత్ర ప్రదర్శనల కార్యక్రమాలను ఎలాంటి అటంకాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లోప్రదర్శనల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రదర్శించే బాలల చలన చిత్రాలను జిల్లా వ్యాప్తంగా ఉండే సినిమా హాళ్లలో ప్రదర్శించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ చలన చిత్ర ప్రదర్శనలు జిల్లాలో ఆగస్టు 17 నుంచి 24వ తేదీ వరకు వారం రోజుల పాటు ప్రదర్శించేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. 35 ఎంఎం చలన చిత్రాలను, యూట్యూబ్ ద్వారా ప్రదర్శించే చలనచిత్రాలు ఆయా సినిమా హాళ్లలో ప్రదర్శించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ప్రక్రియలో జిల్లా విద్యాశాఖాధికారులు ఆయా సినిమా హాళ్ల ప్రతినిధులతో తగిన షెడ్యూల్ ఏర్పాటు చేసి తదనుగుణంగా నిర్దేశించిన సమయంలో ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నెల్లూరు పట్టణంలో, గూడూరు, కావలి పట్టణాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకూ ప్రదర్శించేలా సాంకేతిక ఏర్పాట్లు చేయాలని సూచించారు. సంబంధిత సినిమా హాళ్ల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను షెడ్యూల్డ్ ప్రకారం తరలించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియలో విద్యాశాఖాధికారులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో తగిన ఏర్పాటు చేసి సంబంధిత పాఠశాలల విద్యార్థులకు తెలియచేసి నిర్దేశిత సమయంలో విద్యార్థులు ఆయా సినిమాహాళ్లకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మార్కండేయులు, పౌరసంబంధాల శాఖ డిడి షేక్ లాల్జాన్, సినిమా హాళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు.