మానవ జాతి మనుగడకు మొక్కలు చాలా అవసరం
Published Saturday, 30 July 2016నెల్లూరు రూరల్, జూలై 29: మానవ జాతి మనుగడ సాధించాలంటే మొక్కల పెంపకం అత్యంత ఆవశ్యకమని జిల్లా మంత్రి నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం నెల్లూరు రూరల్ పరిధిలోని కొత్తూరు వద్ద కేంద్ర విద్యాలయం ఆవరణలో వనం-మనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి నారాయణ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వాతావరణ సమతుల్యానికి అడవులు ఎంత అవసరమో నగర ప్రాంతాల్లో మొక్కలు కూడా అంతే అవసరమని చెప్పారు. ఆక్సిజన్ మొక్కల ద్వారానే వస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఒక వ్యక్తి ఆరు మొక్కలు నాటితే, తద్వారా 2029 నాటికి రాష్ట్రం పచ్చదనంతో పరవశించిపోతుందని ఆయన చెప్పారు. శుక్రవారం ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి నాటడం ప్రారంభించిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ నాటిన మొక్కని సంరక్షించుకోవాలని, ఇంటిలో పిల్లలను పెంచిన విధంగా మొక్కలను కూడా పెంచుకోవాలని ఆయన సూచించారు. ఇలా ఆంధ్రప్రదేశ్ హరితవనంగా మారితే సకాలంలో వర్షాలు పడటం వలన రైతులలో ఆర్థిక శక్తి పెరగడం తద్వారా రాష్ట్రం ఆర్థికంగా ముందుకు సాగుతుందన్నారు. అందువల్ల మొక్కల ఆవశ్యకతను పెద్ద వారు పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇలా మొక్కలు నాటుకుంటూపోతే చంద్రబాబునాయుడు కలలు గన్న ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో జెసి ఇంతియాజ్, నగర మేయర్ అజీజ్, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి, ఆర్డిఓ వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్కృష్ణారెడ్డి, డిఎస్పి తిరుమలేశ్వరరెడ్డి, పలువురు టిడిపి నాయకులు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.