ప్రజాపంపిణీ బియ్యం అక్రమ రవాణా!
Published Saturday, 30 July 2016కొత్తూరు, జూలై 29: నిరుపేద బడుగు, బలహీన వర్గాలకు రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వం అందించాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. కొత్తూరులో ప్రజాపంపిణీ బియ్యం నేరుగా అక్రమ రవాణా జరుగుతోంది. స్థానిక ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ఓ రైస్మిల్లుకు లారీలో అక్రమంగా 50 బస్తాల బియ్యం తరలిస్తుండగా కొత్తూరుకు చెందిన కొందరు యువకులు పట్టుకొని సంబంధిత సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలివి.
ఎంఎల్ఎస్ గొడౌన్ నుంచి శ్రీకృష్ణా మోడరన్ రైస్మిల్లుకు చెందిన లారీలో 25 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం బస్తాలు రైస్మిల్లుకు నేరుగా తరలిస్తుండగా గ్రామస్థులు చూసి వెంబడించి రైస్మిల్లులో బియ్యం బస్తాలు దించుతుండగా పట్టుకున్నారు. ప్రభుత్వ ముద్రలతో ఉన్న గోనె సంచులుతో బియ్యం బస్తాలను గుర్తించి వెంటనే రెవెన్యూ, సివిల్సప్లై,
పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. రైస్మిల్లు యజమాని లారీతో బియ్యం మిల్లులోకి తీసుకెళ్లి గేట్లుకు తాళాలు వేసి అన్లోడ్ చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకొనే ప్రయత్నం చేసినప్పటికీ కొద్దిసేపు బయటే ఉండిపోవాల్సి వచ్చింది. వెంటనే కొత్తూరులోని లారీ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు చోడవరపు వెంకటరమణ, మోహనరావు, రాములు రైస్మిల్లు గోడ దూకి వెళ్లి బియ్యం మార్పు చేసేందుకు రైస్మిల్లు యజమాని ప్రయత్నిస్తుండగా అడ్డుకున్నారు. కొంతసేపు గందరగోళం నెలకొనప్పటికీ అధికారులు రంగ ప్రవేశం చేయడంతో ప్రజాపంపిణీ బియ్యంగానే ఉన్నాయని సివిల్ సప్లై డిటి బుచ్చి స్పష్టం చేశారు. గ్రామస్తులతో రైస్మిల్లు యజమాని రాజకీయంగా ఒత్తిళ్లు తెచ్చినప్పటికీ ససేమిరా అనడంతో అధికారులు పట్టుకొని లారీని సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. 25 క్వింటాళ్ల బియ్యం కర్లెమ్మకు చెందిన మరో రైస్మిల్లు యజమానికి అప్పగించారు. ఎం ఎల్ ఎస్ గొడౌన్ నుంచే అక్రమంగా తరలుతున్నట్టు గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమ రవాణాపై రెవెన్యూ అధికారులు కలెక్టర్కు సమాచారం ఇవ్వడంతో స్పందించిన కలెక్టర్ లక్ష్మినృసింహం ఈ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించిన బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్టు తహశీల్దార్ టి.రామకృష్ణ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన నివేదికను జిల్లా జాయింట్ కలెక్టర్కు అందజేయనున్నట్టు తహశీల్దార్ చెప్పారు. గత నెలకు సంబంధించి రేషన్కార్డుదారులకు పంపిణీ చేయగా మిగిలిన బియ్యాన్ని ఎం ఎల్ ఎస్ గొడౌన్లో నిల్వా ఉంచి ఇలా అక్రమ మార్గంలో తరలిస్తున్నట్టు స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ బియ్యం తరలింపునకు, తనకు ఎటువంటి సంబంధం లేదని గొడౌన్ ఇన్చార్జి నాగభూషణరావు తెలియజేశారు. అయితే సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు ఎం ఎల్ ఎస్ గొడౌన్కు సంబంధించిన రికార్డులను పరిశీలించడంతో పాటు గొడౌన్ ఇన్చార్జిను కూడా విచారణ చేయాల్సి ఉన్నప్పటికీ అటువంటి చర్యలు ఏమీ చేయకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది.