డిఎంహెచ్వోగా తిరుపతిరావు బాధ్యతల స్వీకరణ
Published Saturday, 30 July 2016శ్రీకాకుళం(టౌన్), జూలై 29: జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా సనపల తిరుపతిరావు శుక్రవారం సాయంత్రం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత వారం రోజులుగా ఇంచార్జి డిఎంహెచ్వోతో నెట్టుకొస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య రెగ్యులర్ డిఎంహెచ్వోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
కాగా, తిరుపతిరావు ప్రస్తుతం రిమ్స్లో ఆప్తాలమిక్ సర్జన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన డిఎంహెచ్వోగా బాధ్యతలు స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకొని విలేఖర్లతో మాట్లాడారు. జిల్లా వ్యక్తిగా ప్రజల ఆరోగ్యంపై తనకు పూర్తి పట్టు ఉందని, ప్రభుత్వ లక్ష్యాన్ని చేరువగా మెరుగైన వైద్యాన్ని అందించేందుకు తనవంతు కృషిచేస్తానని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ మెండ ప్రవీణ్, డాక్టర్ బగాది జగన్నాథం, డాక్టర్ దవళ భాస్కరరావు, డాక్టర్ హేమంత్ కుమార్ పాల్గొన్నారు.