పుష్కర కళ వచ్చేసింది...
Published Saturday, 30 July 2016విజయవాడ, జూలై 29: ప్రభుత్వం ప్రారంభించిన గ్రీనాంధ్రప్రదేశ్తో నగరం పచ్చదనంగా మారుతుండగా మరోపక్క రోడ్డు పక్కన వున్న చెట్లకు అందంగా లైటింగ్స్ వేయటంతో అవి దగదగా మెరిసిపోతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన వనం-మనంతో ఖాళీ ప్రదేశాల్లో గ్రీనిష్ ఏర్పడుతుండగా, నగరంలో ఏర్పాటు చేసిన లైటింగ్ వల్ల నగరానికి పండుగ కళ వచ్చింది. నగరంలో చెట్లు నాటటం వల్ల పర్యావరణ పరంగా సమతుల్యత ఏర్పడుతుంది. ఇక చెట్లకు రకరకాల లైటింగ్స్ వేయటం వల్ల అవి అందంగా తయారయ్యాయి. దీంతో నగరం ఒక్కపక్క పచ్చదనం, మరోపక్క కాంతుల మయం అవుతుంది. ఇంకా నగరంలో పరుగులు పెడుతున్న కాలువల పక్కన ఏర్పరచిన పచ్చికలతో అవి అందంగా మారాయి. ఇంకోపక్క వాల్ పెయింట్స్తో నగరంలో ఎక్కడ చూసినా కూడా క్లీన్ అండ్ గ్రీన్తో పాటు నీట్గా మారింది. ఇదంతా పుష్కరాల కారణంగా నగరంలో ప్రభుత్వపరంగా చేసిన ఏర్పాట్లతోపాటు వాలంటీర్లు వేసిన పెయింటింగ్స్తో వచ్చిన కళగా చెప్పవచ్చు. ఈ పుష్కరాలతో నగరానికి ఒక కొత్త రూపు రానుంది. పుష్కరాల సందర్భంగా నగరంలో రూ.3వేల కోట్లతో అభివృద్ధి పనులను చేపడుతున్నారు. పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. త్వరలోనే చాలా వరకు పనులు పూర్తి కావస్తున్నాయి. ఇక నగరంలో ఏర్పాటుచేసిన కాంతులను చూడటానికి నగర ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. సిటీలో అన్ని ప్రదేశాల్లో లైటింగ్ వేస్తుండటంతో ఆ లైటింగ్ కాంతులతో నగరం అందంగా తయారైంది. అనుకున్న విధంగా లైటింగ్ ఏర్పాట్లు పూర్తి అయితే విజయవాడ సిటీ ఒక వెలుగు వెలిగిపోవటం ఖాయం. మరోపక్క విజయవాడ సిటీలో రాత్రి అయితే చాలు కొత్త రకం కాంతులతో, రకరకాల లైట్లతో నగరం మెరిసిపోతుంది. బందరురోడ్డుకి రెండుపక్కలా, సిఎం క్యాంప్ ఆఫీస్ పరిసరాలతో పాటు ఏలూరు రోడ్డు పరిసరాల్లో ఏర్పాటుచేసిన లైటింగ్ చూపరులను ఆకట్టుకుంటుంది. దీంతో నగరానికి కొత్త కాంతులు వచ్చాయి. అప్పుడే నగరంలో పుష్కర కళ ఏర్పడింది.