నాటిన మొక్కలను పరిరక్షించాలి
Published Saturday, 30 July 2016చోడవరం, జూలై 29: మొక్కలు నాటడమే కాదు వాటిని పరిరక్షించాల్సిన బాధ్యతను ప్రతీ ఒక్కరూ చేపట్టాలని ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజు అన్నారు. మండలంలో వనం- మనం కార్యక్రమం పెద్దఎత్తున నిర్వహించారు. శుక్రవారం ఒక్కరోజే మండలంలోని వివిధ గ్రామాల్లో 14వేల 380 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఖండిపల్లి గ్రామంలో మొక్కలు నాటి వనం-మనం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మొక్కల పెంపకం వలన వాతారవణ సమతుల్యత ఏర్పడుతుందన్నారు. అలాగే కాలుష్యాన్ని కూడా నివారించవచ్చన్నారు. ఫలసాయం ఇచ్చే మొక్కలతోపాటు వేప, కానుగ వంటి మొక్కలను కూడా నాటి వాటికి కంచెను ఏర్పాటు చేసి వాటిని రక్షణ బాధ్యతలను కూడా ప్రజలు స్వీకరించాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ జట్టి మాణిక్యం రక్షిత మంచినీటి సరఫరా, లక్కవరం - ఖండిపల్లి రహదారి నిర్మాణానికి నిధుల గూర్చి కోర గా ఆయన 1.10కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, త్వరలో రహదారి నిర్మాణ పనులను మంత్రి తో ప్రారంభించడం జరుగుతుందన్నారు. అలాగే కమ్యునిటీ హాలు, రక్షిత మంచినీటి పథకాల ఏర్పాటుకు కూడా నిధులు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలియజేసారు. అంతకుముందు ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గూనూరు కొండతల్లి, జెడ్పీటీసీ కనిశెట్టి మత్స్యరాజు, ఫారెస్టు రేంజ్ అధికారి శ్రీనివాసరావు, గోపాల్నాయుడు, మాజీ సర్పంచ్ కడిమి అప్పారావు, కార్యదర్శి పట్నాయక్, ఎంపీటిసి సభ్యులు మారేడుపూడి రమాదేవి, ఎంపీడివో చిట్టిరాజు, మండల పార్టీ అధ్యక్షులు నాగగంగాధర్ పాల్గొన్నారు.