బాధ్యతగా మొక్కలు నాటండి
Published Saturday, 30 July 2016అరకులోయ, జూలై 29: ప్రతి పౌరుడు మొక్కలు నాటే కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకోవాలని అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు కోరారు. మిషన్ హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో శుక్రవారం వనం మనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ప్రాంగణంలో కూడా ఆయన మొక్కలు నాటారు. అంతకుముందు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయ న మాట్లాడు తూ ప్రతి ఒక్కరూ మొక్క లు నాటి పర్యావరణం, పచ్చదనాన్ని కాపాడాలని అన్నారు. మానవాళి మనుగడకు వృక్షాలు అవసరమని, దీనిని గుర్తించి అందరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని అన్నారు. మొక్కల సంరక్షణతో పర్యావరణాన్ని కాపాడవచ్చునన్నారు. వృక్షాలు మానవ జీవితంలో ఒక భాగమని దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనం మనం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అడవుల్లో 33 శాతం వృక్షాలు ఉండాల్సి ఉండగా నానాటికి అంతరించిపోతుండడం వలన పలు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోందని అన్నారు. దీనివలనే హుదూద్ వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయన్నారు. విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమంపై దృష్టి సారించాలని సర్వేశ్వరరావు కోరారు. అటవీ శాఖ స్థానిక రేంజి అధికారి బోనంగి అప్పారావు మాట్లాడుతూ 67వ వనమహోత్సవం కార్యక్రమం కింద 5 వేల 150 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. రహదారికి ఇరువైపులా మొక్కలు నాటి ఆహ్లాదం నింపేందుకు తమవంతు కృషి చేస్తున్నామని చెప్పారు. విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తున్న తమకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి. కె.అరుణకుమారి, జెడ్పీటీసీ కూన వనజ, అటవీ శాఖ సెక్షన్ ఫారెస్టర్లు పి.్భస్కరరావు, జి.రాజగోపాల్, కె.కృష్ణారావు, గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ జాకబ్, దేశం నాయకులు పొద్దు అమ్మన్న, మహాదేవ్, యాసిన్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.