మళ్లీ ‘నయనా’నందం
Published Saturday, 30 July 2016‘జోడి కట్టిందే నీ కోసం..’ అంటూ వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మి’ చిత్రంలో వెంకటేష్ సరసన ఆడిపాడి యువతను తనవైపునకు తిప్పుకున్న అందాల తార నయనతార మరో సారి అతడితోనే జత కట్టబోతోంది. ఇద్దరి కలయికలో వచ్చిన ‘లక్ష్మి’, ‘తులసి’ చిత్రాలు ఈ జంటకు భలే క్రేజ్ని తెచ్చిపెట్టాయి. ఈ సినిమాల తర్వాత నయనతారకు తెలుగులో భలే అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ‘బాబు బంగారం’లో వెంకటేష్తో చాలా కాలం తర్వాత కనిపించబోతోంది. తెలుగు, తమిళం అంటూ రెండు పడవల ప్రయాణం చేసిన ఈ ముద్దుగుమ్మను ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. తన వ్యక్తి గత విషయాలపై ఆమె ఎంతో ఆవేదన చెందినా, కెరీర్ విషయంలో మాత్రం ఈమె ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ‘‘టాలీవుడ్లో మరో మంచి సినిమా ద్వారా వెంకటేష్తో కనిపించబోతున్నందుకు చాలా సంతోషంగా వుంది. ఈ చిత్రం తర్వాత మళ్లీ తెలుగులో బిజీ అవుతానన్న నమ్మకం నాకుంది’’ అంటూ చెప్పుకొచ్చింది నయన. అన్నట్లు ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు సిద్ధమవుతోందిట. అదీ..సంగతీ!!