హ్యాట్రిక్ ‘ట్రిపుల్’ సాధిస్తా
Published Sunday, 31 July 2016కింగ్స్టన్ (జమైకా), జూలై 30: ఒలింపిక్స్లో మూడోసారి ‘ట్రిపుల్’ను సాధించి చరిత్ర సృష్టించడమే తన లక్ష్యమని ‘జమైకా చిరుత’, లెజెండరీ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ స్పష్టం చేశాడు. ఆ లక్ష్యాన్ని సాధి స్తానని ధీమా వ్యక్తం చేశాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో పురుషుల 100, 200 మీటర్ల పరుగుతోపాటు 400 మీటర్ల రిలేలోనూ అతను స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్లో అదే ఫీట్ను పునరావృతం చేశాడు. రియో ఒలింపిక్స్లో మరోసారి ఈ మూడు విభాగాల్లోనూ విజేతగా నిలవడం ద్వారా ‘ట్రిపుల్ హ్యాట్రిక్’ను సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు. నిజానికి జమైకా ట్రయల్స్లో పాల్గొన్న అతను కండరాలు బెణకడంతో రేస్ను పూర్తి చేయలేకపోయాడు. ఆ కారణంగా అతనికి రియో ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశం దక్కదు. కానీ, ప్రత్యేక కేసుగా దీనిని స్వీకరించిన జమైకా అథ్లెటిక్స్ సమాఖ్య అధికారులు అతనిని ఒలింపిక్స్కు ఎంపిక చేశారు. రియో బయలుదేరిన సందర్భంగా బోల్ట్ విలేఖరులతో మాట్లాడుతూ వరుసగా మూడోసారి ‘ట్రిపుల్’ను అందుకోవడమే లక్ష్యంగా ఎంచుకున్నానని అన్నాడు. ‘ఇప్పుడు నేను సజీవ లెజెండ్ను. ముచ్చటగా మూడోసారి ఒలింపిక్స్లో మూడు స్వర్ణాలను సాధించడమే నా లక్ష్యం. అదే నా చిరకాల కల. దానిని నెరవేర్చుకునే శక్తిసామర్థ్యాలు నాకు ఉన్నాయి’ అన్నాడు. కాగా, రియో ఒలింపిక్స్లో పాల్గొనడానికి బోల్ట్ ముమ్మంగా ప్రాక్టీస్ చేశాడు. ఈ సీజన్లో 100 మీటర్ల పరుగును 9.88 సెకన్లలో పూర్తి చేసిన 29 ఏళ్ల బోల్ట్ తన సత్తాను చాటిచెప్పాడు. కింగ్స్టన్లో గత నెల 11న జరిగిన ఈవెంట్లో అతను ఈ సీజన్లో ప్రపంచ మేటి టైమింగ్స్లో రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఫ్రాన్స్కు చెందిన జిమీ వికాట్ ఒక్కడే 9.86 సెకన్లతో ఈఏడాది బోల్ట్ కంటే మెరుగైన టైమింగ్ను నమోదు చేశాడు. బోల్ట్ పట్టుదలను చూసే జమైకా అథ్లెటిక్స్ సమాఖ్య అతనికి రియో ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించింది. నిజానికి నిబంధలను అనుసరించి ఒలింపిక్స్లో పాల్గొనే వారంతా తప్పనిసరిగా ట్రయల్స్కు హాజరుకావాలి. కనీస అర్హతా ప్రమాణాలను అందుకోవాలి. పోటీల్లో సఫలం కావాలి. ట్రయల్స్లో 100 మీటర్ల స్ప్రింట్ను సమర్థంగా పూర్తి చేసిన బోల్ట్ 200 మీటర్ల విభాగంలో పరుగెతుతున్నప్పుడు కాలి కండరాలు బెణకడంతో రేస్ నుంచి తప్పుకొన్నాడు. ఒక్కో విభాగంలో ముగ్గురికి మాత్రమే ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశం దక్కుతుంది. స్టాండ్ బై విధానానికి అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో, తప్పక నెగ్గాల్సిన ట్రయల్స్లో బోల్ట్ పాల్గొనలేకపోయాడు. ఇది ఒక సమస్య అయితే, యొహాన్ బ్లేక్, నికెల్ ఆష్మీడ నుంచి గట్టిపోటీ ఎదురుకావడం మరో సమస్యగా మారింది. వారిద్దరూ ఈ సీజన్లో 100 మీటర్ల స్ప్రింట్ను 9.94 సెకన్లలో పూర్తి చేసి ఫామ్ను నిరూపించుకున్నారు. నాలుగేళ్ల క్రితం లండన్ ఒలింపిక్స్ 100 మీటర్ల స్ప్రింట్లో పోటీకి దిగిన యొహాన్ బ్లేక్ హీట్స్లో బోల్ట్ను అధిగమించి అగ్ర స్థానాన్ని ఆక్రమించాడు. అయితే, ఫైనల్స్లో అదే స్థాయిలో రాణించలేకపోయాడు. బోల్ట్ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచి స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. అతని ట్రాక్ రికార్డు గురించి తెలుసినందునే జమైకా అథ్లెటిక్స్ సమాఖ్య అతనిని రియో ఒలింపిక్స్ బృందంలో చేర్చింది. బోల్ట్ కూడా తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. అందుకు తగ్గట్టుగానే అతను చా లా కాలంగా ట్రాక్స్పై శ్రమిస్తున్నాడు. అథ్లెటి క్స్ చరిత్రలోవనే గతంలో ఎవరూ, ఎన్నడూ సాధించని విధంగా అతను వరుసగా మూడో సారి ట్రిపుల్ను సాధించి, హ్యాట్రిక్ను నమోదు చేస్తే, లెజెండ్ అన్న పేరు స్థిరపడుతుంది. బోల్ట్కు ఆ సామర్ధ్యం ఉందని విశే్లషకులు అభిప్రాయ పడుతున్నారు. వారి అంచనా మేరకు ఫలి స్తుందో చూడాలి.
చిత్రం.. ట్రిపుల్ హ్యాట్రిక్పై కనే్నసిన బోల్ట్