వ్యాన్ కొట్టుకుపోయి 20 మంది దుర్మరణం
Published Sunday, 31 July 2016పెషావర్, జూలై 30: పాకిస్తాన్లో శనివారం ఆకస్మికంగా ముంచెత్తిన వరదల్లో ఒక వ్యాన్ కొట్టుకుపోయి, అందులో ప్రయాణిస్తున్న 20 మంది మృతి చెందారు. వాయువ్య పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా రాష్ట్రంలో బారానుంచి బజార్ జాఖా ఖేల్కు పెళ్లి బృందాన్ని తీసుకొని వెళ్తున్న వ్యాన్ తబాయి ప్రాంతంలో ఆకస్మికంగా వచ్చిన వరదల్లో చిక్కుకొని కొట్టుకుపోయింది. దీంతో ఇందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు పిల్లలు, పది మంది పురుషులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సహాయక సిబ్బంది మృతదేహాలను బయటకు తీసి, లాండీ కోతల్లోని ఆసుపత్రికి తరలించారు. ఖైబర్ పఖ్తున్ఖ్వా రాష్ట్రంలో కురిసిన కుండపోత వర్షాల వల్ల ఈ ఆకస్మిక వరదలు వచ్చాయి. పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా 55 మంది మృతి చెందగా, 35 మంది గాయపడినట్లు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటి (ఎన్డిఎంఎ) తెలిపింది.