శ్రీశైలంలో కారు బోల్తా.. ఇద్దరు మహిళల మృతి
Published Sunday, 31 July 2016శ్రీశైలం ప్రాజెక్టు, జూలై 30: నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో దోమలపెంట సమీపంలో శనివారం రాత్రి కారు బోల్తాపడిన సంఘటనలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్లోని బేగంబజార్కు చెందిన ఒక కుటుంబం శ్రీశైలం మల్లన్న దర్శనానికి కారు (ఎ09బిఎక్స్ 8287)లో బయలుదేరారు. దోమలపెంటకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో గల శ్రీశైలం ఘాట్ రోడ్డులో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో సీతాఅగర్వాల్ (30), సిఖాఅగర్వాల్ (27) అక్కడికక్కడే మరణించారు. ఇదే కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని చూసిన కొందరు వ్యక్తులు ఈగలపెంట పోలీసులకు సమాచారం అందించారు. శ్రీశైలం ఘాట్రోడ్డులో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న అమ్రాబాద్ సిఐ శ్రీనివాసులు, ఈగలపెంట ఎస్ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను అమ్రాబాద్కు తరలించి క్షత గాత్రులను హైదరాబాద్కు తరలించారు.