S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హోదా గోదాలో ఎవరు హీరో?

హైదరాబాద్, జూలై 30: ప్రత్యేక హోదాపై ఏపిలో నాలుగు స్తంభాలాట కొనసాగుతోంది. నాలుగు ప్రధాన పార్టీలు ఎవరికి వారు రాజకీయ ప్రయోజనం పొందేందుకు పరుగులు తీస్తున్నాయి. అధికార తెదేపా, ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా, రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్, దానిని సమర్థించి ఇప్పుడు చిక్కుల్లో పడిన భాజపా హోదాపై రాజకీయ క్రీడల్లో మునిగిపోయాయి. హోదాపై సంయుక్త పోరాటం బదులు, ఒకరిపై ఒకరు బురద చల్లుకునే రాజకీయ వ్యూహానికి తెరలేపాయి.
హోదా అంశంలో తప్పంతా కాంగ్రెస్, బిజెపిదేనన్న కొత్త కోణంలో తెదేపా తన వ్యూహం రచించింది. ఇప్పటివరకూ కేంద్రంలోని బిజెపిపై వౌనం వహించిన బాబు తాజాగా బిజెపిపై స్వరం పెంచారు. దీంతో ఆ పార్టీ ఎంపీలు కూడా విమర్శల దాడికి పదునెక్కిస్తున్నారు. విజయవాడ ఎంపి కేశినేనినాని ఒకడుగు ముందుకేసి, బాబు వంటి నమ్మకమైన మిత్రుడిని పోగొట్టుకుంటే బిజెపికే నష్టమని వ్యాఖ్యానించారు.
టిడిపి ఎమ్మెల్సీ సోమిరెడ్డి హోదా వ్యవహారం మోదీ విశ్వసనీయతపై ఆధారపడి ఉందని బిజెపిని ఇరికించే ప్రయత్నం చేశారు. మరో మాజీమంత్రి గాలి మరీ తీవ్రస్థాయిలో స్పందిస్తూ, హోదా ఇచ్చేంతవరకూ బిజెపి నేతలను రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఎంపి సీఎం రమేష్ కాంగ్రెస్-బిజెపి కలసి కుట్ర చేస్తున్నాయన్నారు. ఈ విమర్శల లక్ష్యం అంతా బిజెపితో మొహమాటం లేదని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్న సంకేతాలు పంపించడమే తెదేపా రాజకీయ వ్యూహంగా స్పష్టమవుతోంది.
కాగా, సోమవారం లోక్‌సభలో హోదాపై వాయిదా తీర్మానం ఇవ్వడం ద్వారా తాము మాత్రమే దానికోసం పోరాడుతున్నామన్న సంకేతాలకు తెదేపా సిద్ధమవుతోంది. కాంగ్రెస్‌కు రాష్ట్రం నుంచి లోక్‌సభలో సభ్యులు లేకపోవడం, బిజెపికి ఇద్దరు ఎంపీలున్నా వారెవరూ మాట్లాడేవారు కాకపోవడంతో, లోక్‌సభలో సంఖ్యాబలంతో రాజకీయంగా లాభపడాలని తెదేపా భావిస్తోంది.
అటు ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా తెదేపాను లక్ష్యంగా చేసుకుని రాజకీయ వ్యూహం రచిస్తోంది. హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఆగస్టు2న రాష్టబ్రంద్‌కు పిలుపునిచ్చింది. హోదాపై బాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి బయటకు రావాలని డిమాండ్ చేస్తోంది. ఓటుకునోటు భయంతోనే బాబు కేంద్రానికి భయపడుతున్నారన్న కోణానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. బంద్ ద్వారా తెదేపా వైఫల్యాన్ని ప్రజల ముందుంచి, బాబును ముద్దాయిగా నిలబెట్టడమే వైకాపా లక్ష్యంగా కనిపిస్తోంది.
తెదేపాకు పోటీగా వైకాపా కూడా సోమవారం లోక్‌సభలో హోదాపై వాయిదా తీర్మానం ఇవ్వాలని నిర్ణయించింది. తద్వారా హోదా ఇవ్వకపోయినా తెదేపా కేంద్రం నుంచి బయటకురాకుండా ఉండిపోతే, తాము మాత్రమే హోదా కోసం పోరాడుతున్నామన్న సంకేతాల కోసం రాజకీయ వ్యూహానికి పదును పెడుతోంది.
ఇక రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్, హోదాతో మళ్లీ ప్రజలకు చేరువయ్యే పనిలో ఉంది. కోటి సంతకాల సేకరణ విఫలమయిన తర్వాత మీడియా సమావేశాలకే పరిమితమైన కాంగ్రెస్, కెవిపి ప్రైవేటు బిల్లుతో మళ్లీ జనంలోకి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఆగస్టు 2న వైకాపా తలపెట్టిన రాష్ట్ర బందుకు మద్దతు ప్రకటించింది.
ఈ మొత్తం రాజకీయ క్రీడలో బిజెపి పూర్తిగా వెనుకబడిపోయింది. రాష్ట్రానికి 2 లక్షల కోట్లు ఇచ్చామన్న ఒక్క మాట తప్ప, హోదాలో తమపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే పరిస్థితి కనిపించడం లేదు. రెండురోజుల నుంచి మిత్రపక్షమైన తెదేపా చేస్తున్న విమర్శలకు జవాబు చెప్పేనాధుడు పార్టీలో కరవయ్యారు. మూడు పార్టీల వ్యూహాలకు బిజెపి బలిపశువయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.