మద్యం సేవించి వాహనాలు నడపడం నేరం
Published Sunday, 31 July 2016హైదరాబాద్/గచ్చిబౌలి, జూలై 30: మద్యం ప్రాణాంతకమని, మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమనే నినాదాలు మద్యం బాటిళ్లపై ముద్రించే యోచనలో ఉన్నామని ఎక్సైజ్ కమిషనర్ ఆర్.చంద్రవదన్ తెలిపారు. శనివారం సైబరాబాద్ కమిషనరేట్లో ‘అండర్ ఏజ్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్’పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కమిషనర్ చంద్రవదన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, దాంతో పాటు మైనర్లు వాహనాలు నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వివిధ సర్వేల్లో తేలినట్లు చెప్పారు.
మైనర్లకు మద్యం విక్రయించే వారి పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు మద్యం షాపుల లైసెన్స్లు కూడా రద్దు చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. ‘మిషన్ స్మార్ట్’ పేరుతో మద్యం తయారీ సంస్థలతో పాటు బార్ అండ్ రెస్టారెంట్స్, స్టార్హోటళ్లలో పనిచేసే వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నగరంలోని పబ్లు, బార్లు, స్టార్హోటళ్ల వారు బ్రీత్ ఎనలైజ్ సిస్టంను ఏర్పాటుచేసుకుంటే బాగుంటుందని సమావేశంలో సూచించగా అందుకు కొందరు సిద్ధంగా ఉన్నామన్నారు. సైబరాబాద్ ఈస్ట్ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ, లైసెన్స్లు లేకున్నా, మద్యం సేవించి వాహనం నడిపినా శిక్షార్హులని, ఆ శిక్షలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
చిత్రం..‘‘మైనర్లకు వాహనాలు ఇవ్వరాదు’’ అనే పోస్టర్ను
విడుదల చేస్తున్న ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్