ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీ చేస్తున్న దొంగ అరెస్టు
Published Sunday, 31 July 2016హైదరాబాద్, జూలై 30: ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ఓ దుండగుడిని సౌత్జోన్ పోలీసులు అరెస్టు చేశారు. మెదక్ జిల్లా న్యాలకల్ మండలానికి చెందిన ఉషాల యాదులు అలియాస్ యాది (33) గత కొంతకాలంగా మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్మగూడలో నివాసముంటున్నాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. భరత్నగర్లో నాలుగు తులాల బంగారు గొలుసును అమ్మేందుకు యత్నిస్తుండగా మాదన్నపేట పోలీసులు అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా జంటనగరాల్లో పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడినట్టు అంగీకరించాడు. యాదిపై కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు, భవానినగర్ పోలీస్ స్టేషన్లో నాలుగు, సంతోష్నగర్ పోలీసు స్టేషన్లో ఒక కేసు నమోదై ఉంది. 2000లో అంబర్పేట పిఎస్లో మొదటి కేసు నమోదైనట్టు డిసిపి సత్యనారాయణ తెలిపారు. 2015లో పిడి యాక్టు పెట్టగా ఒక సంవత్సరం పాటు జైలులో ఉన్నాడని జైలు నుంచి విడుదలయ్యాక మళ్లీ చోరీలకు పాల్పడుతున్నాడని వివరించారు. నిందితుడి నుంచి సుమారు రూ. 16 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీన పరచుకుని, నిందితుడిపై పిడి యాక్టు పెట్టామని వివరించారు.