ఎంసెట్-2 లీకేజీపై వెల్లువెత్తిన నిరసనలు
Published Sunday, 31 July 2016హైదరాబాద్, జూలై 30: ఎంసెట్-2 ప్రశ్నా పత్రం లీకేజీపై, రద్దు చేయాలన్న ప్రభుత్వ ఆలోచనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు బాధ్యులైన మంత్రులను, అధికారులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం వివిధ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, వౌన ప్రదర్శనలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశాయి. తెలుగు దేశం పార్టీ అనుబంధ విభాగమైన టిఎన్ఎస్ఎఫ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట వౌన ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రశ్నా పత్రం లీకేజీ వ్యవహారంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని, మంత్రి సి. లక్ష్మారెడ్డిని బర్తరఫ్ చేయాలని, సంబంధిత ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎంసెట్-2 రద్దు చేయాలనుకోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని ఎఐఎస్ఎఫ్, ఎన్ఎఫ్ఐడబ్ల్యు, ఎఐవైఎఫ్ నాయకులు ఆరోపిస్తూ హిమాయత్నగర్ వైజంక్షన్లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఎబివిపి కార్యకర్తల అరెస్టు
ఇలాఉండగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి లక్ష్మారెడ్డి, ఉన్నతాధికారులు పాపిరెడ్డి, రమణారావులను వెంటనే బర్తరఫ్ చేయాలని ఎబివిపి కార్యకర్తలు డిమాండ్ చేస్తూ సచివాలయం ముట్టడించేందుకు ప్రయత్నించగా కొంత సేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. చివరకు పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
చిత్రం.. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి లక్ష్మారెడ్డిలను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ
శనివారం సచివాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన ఎబివిపి కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు