ప్రత్యేకహోదా ప్రాణప్రదం
Published Sunday, 31 July 2016విజయవాడ:ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో కేంద్రం చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. 14వ ఆర్థికసంఘం సిఫారసుల ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమన్న కేంద్రమంత్రి జైట్లీ వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. కేంద్రం హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఇది రాష్ట్రానికి జీవన్మరణ సమస్య అని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో బిజెపి నేతలుకూడా ప్రత్యేకహోదాకోసం పట్టుబట్టారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో జోక్యం చేసుకునే అధికారం 14వ ఆర్థికసంఘానికి లేదని ఆయన అన్నారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, ప్రధానికి అన్ని విషయాలు వివరిస్తామని అన్నారు. విజయవాడలో టిడిపి ఎంపీలతో సమావేశమైన ఆయన పార్లమెంట్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చించారు. సంకీర్ణ ధర్మం పాటిస్తూనే రాష్ట్ర ప్రత్యేకహోదాకోసం పోరాడతామని ఆయన చెప్పారు.