కేంద్ర నిధుల మళ్లింపు..!
Published Sunday, 31 July 2016నల్లగొండ, జూలై 31: రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం..వాటర్ షెడ్ పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంత పథకాలకు మళ్లిస్తుండడంతో గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు, వాటర్ షెడ్ల విస్తరణ పథకాల నిర్వహణను అస్తవ్యవస్తంగా మార్చివేస్తోంది. గతంలో కేంద్రం నుండి గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్కు నేరుగా అందే మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చేరుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సదరు నిధులు సొంత పథకాల నిర్వహణకు మళ్లిస్తూ వీలైనప్పుడు తిరిగి ఉపాధి హామీ పథకం నిర్వహణకు విడుదల చేస్తోంది. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుండటం ఉపాధి హామీ పనుల కొనసాగింపుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది కేంద్రం వాటర్షెడ్ పథకాలకు తనవంతుగా 70 కోట్లు మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా 70 కోట్లు అందించాల్సివుంది. అందుకు విరుద్ధంగా కేంద్ర నిధులు 70 కోట్లను సైతం రాష్ట్ర ప్రభుత్వం సొంత పథకాల నిర్వహణకు వినియోగించుకుని ఏడు నెలలుగా సదరు డబ్బులు తిరిగి బదలాయించడం లేదు. దీంతో కరవు పీడిత తెలంగాణ జిల్లాల్లో భూగర్భ జలవనరుల అభివృద్ధికి, వర్షపునీరు నిల్వ వనరుల అభివృద్ధికి కీలకమైన వాటర్ షెడ్ పథకాల పనులు ఆగిపోయాయి.
అటు ఉపాధి హామీ పథకం నిధులు సైతం కేంద్రం అందించిన దాదాపు 100 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు మళ్లించిందని దీంతో గ్రామాల్లో ఉపాధి పనుల కొనసాగింపు సమస్యగా మారిందని ఉపాధి హామీ పథకం అధికారులు వాపోతున్నారు. గత నెల 24 నుండి ఇప్పటిదాకా నెల రోజులకుపైగా ఉపాధి హామీ పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయింపులు లేక పనుల కొనసాగింపునకు అవరోధంగా మారింది. అంతకుముందు మార్చి-ఏప్రిల్ మాసాల్లోనూ కేంద్ర ఉపాధి నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుని సకాలంలో సర్దుబాటు చేయకపోవడంతో కూలీల వేతనాలు ఆగి గ్రామాల్లో ఆందోళనలు చెలరేగాయి. మరోసారి అదే దారిలో ఉపాధి నిధుల మళ్లింపు కొనసాగుతుండడం ఉపాధి హామీ పథకాలు, పనులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా హరితహారం నిర్వహణకు ఉపాధి హామీ పథకం నిధులే ఖర్చు చేయాల్సివస్తోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిధుల్లో నుండి వాడుకున్న మేరకు సకాలంలో సర్దుబాటు చేయకపోతుండటంతో హరితహారం కార్యక్రమాల నిర్వహణలో ఆటంకాలు ఎదుర్కోవాల్సివస్తుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.