2న జరిగే ప్రత్యేక హోదా బంద్ను జయప్రదం చేయాలి
Published Sunday, 31 July 2016గుంటూరు (కొత్తపేట), జూలై 31: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆగస్టు 2న నిర్వహించే బంద్ను ప్రజలు, కార్మిక, కర్షక, వ్యాపారవర్గాలు స్వచ్ఛందంగా మద్దతు తెలియజేసి జయప్రదం చేయాలని సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు జంగాల అజయ్కుమార్, పాశం రామారావులు పేర్కొన్నారు. ఆదివారం కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎపికి ప్రత్యేకహోదాతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రాజ్యసభలో బిజెపి వ్యవహరించిన తీరుకు నిరసనగా సాధనసమితి సిపిఐ, సిపిఎం రాష్టబ్రంద్కు పిలుపునిచ్చాయన్నారు. 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోవడంలేదని బిజెపి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకహోదాపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్చేశారు. ప్రత్యేకహోదా వచ్చేవరకు టిడిపి, బిజెపితో తన పొత్తును వదులుకోవాలన్నారు. ప్రత్యేకహోదా సాధన సమితి జిల్లా అధ్యక్షుడు పివి మల్లికార్జునరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన రెండేళ్లు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క హామీ నేటికీ అమలు కాలేదన్నారు. సమావేశంలో సిపిఐ, సిపిఎం నగర కార్యదర్శులు కోట మాల్యాద్రి, భావన్నారాయణ, ఇఫ్టా జాతీయ కార్యదర్శి పులి సాంబశివరావు పాల్గొన్నారు.