దుకాణాల బంద్తో దిగొచ్చిన అధికారులు
Published Monday, 1 August 2016ఖమ్మం, జూలై 31: అధికారుల ఒత్తిడిని తట్టుకొని వ్యాపారం చేయలేమని, అనవసరంగా కేసులు పెడుతూ తమను ఇబ్బందులు పెడుతున్నారని మద్యం వ్యాపారులు చేసిన ఆరోపణలకు అధికారుల్లో చలనం వచ్చింది. ఖమ్మం జిల్లా మద్యం శాఖ ఉన్నతాధికారులు అనవసరంగా కేసులు పెడుతూ తమను వేధిస్తున్నారని, ప్రభుత్వం నిర్దేశించిన నియమ, నిబంధనలను పాటిస్తున్నా ఇబ్బందులు తప్పడం లేదని ఆరోపిస్తూ వ్యాపారులు రెండురోజుల క్రితం దుకాణాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై జిల్లా అధికారులు కొందరు వ్యాపారులతో చర్చలు జరిపినా సఫలీకృతం కాలేదు. దీంతో ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ వ్యాపారుల నేతలను హైదరాబాద్ పిలిపించారు. దీంతో వ్యాపారులు అధికారుల నుంచి ఎదురవుతున్న సమస్యలను, వ్యాపారంలోని ఇబ్బందులను ఆయనకి వివరించారు. దీంతో ఆయన సమస్యను పరిష్కరిస్తానని స్పష్టమైన హామీని ఇవ్వడంతో జిల్లాలోని 142మద్యం దుకాణాలు తిరిగి తెరుచుకున్నాయి. ఇదిలా ఉండగా మద్యం వ్యాపారుల ఆందోళనతో దిగివచ్చిన అధికారులు వారికి ఇచ్చిన హామీమేరకు సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. అయితే ఏక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ మహేష్ దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్ళడంతో సమస్య పరిష్కారంపై వ్యాపారుల్లో కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. అయితే రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశం మేరకే మహేష్బాబు సెలవుల్లో వెళ్ళారని, మరో ఎనిమిది నెలల్లో పదవీ విరమణ చేయనున్న ఆయనను త్వరలోనే మరో జిల్లాకు బదిలీ చేయనున్నట్లు సమాచారం. కాగా జిల్లాలోని ఏ మద్యం దుకాణంలోనూ ఎంఆర్పి ధరకంటే అధికంగా మద్యాన్ని విక్రయించడం లేదని, అయినప్పటికీ తమపై కేసులు పెట్టడం వల్ల తాము దుకాణాలను బంద్ చేయవల్సి వచ్చిందని, అయినప్పటికీ ఉన్నతాధికారుల హామీ మేరకు తిరిగి యధావిధిగా వ్యాపారం కొనసాగిస్తున్నామని సంఘ నేతలు వెల్లడించారు.