‘ఆ నిషేధం.. అమ్మకాలకు ఊతం’
Published Monday, 1 August 2016న్యూఢిల్లీ, జూలై 31: ఢిల్లీ-ఎన్సిఆర్ పరిధిలో డీజిల్, పెట్రోల్ వాహనాలపై నిషేధం.. కొత్త వాహనాల కొనుగోళ్లకు ఊతమిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఐసిఆర్ఎ అభిప్రాయపడింది. ఈ ప్రతిపాదిత వాహన ఆధునికీకరణ కార్యక్రమంతో కనీసం 3 శాతం అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేసింది. ద్విచక్ర వాహన విక్రయాలు కూడా 2 శాతం పెరగవచ్చని, వాణిజ్య వాహన కొనుగోళ్లూ సుమారు 6-7 శాతం వృద్ధి చెందవచ్చని ఐసిఆర్ఎ లిమిటెడ్ సీనియర్ ఉపాధ్యక్షుడు సుబ్రతా రే అన్నారు. కాలుష్యాన్ని అరికట్టడంలో భాగంగా పదేళ్లకు పైబడిన డీజిల్ వాహనాలను, పదిహేనేళ్లకు పైబడిన పెట్రోల్ వాహనాలను స్క్రాపింగ్ చేయాలని ఎన్జిటి గత నెల ఆదేశించినది తెలిసిందే.
ఆంధ్రా, తెలంగాణల్లో హెటిరో యూనిట్లు
ముంబయి, జూలై 31: హెటిరో హెల్త్కేర్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు అస్సాంలో మూడు యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. దేశీయ మార్కెట్ కోసం ఇక్కడ ఔషధ ఫార్ములాలను తయారు చేయనుంది. ఏపి యూనిట్ ఈ డిసెంబర్లో ప్రారంభమవుతుండగా, వచ్చే ఏడాది మార్చికి అస్సాం యూనిట్ మొదలవనుంది. తెలంగాణ యూనిట్కు మాత్రం సమయం పడుతుందని హెటిరో హెల్త్కేర్ పికె హరిదార్ పిటిఐకి తెలిపారు.
ఇక సులువుగా టాటా స్కై రీచార్జ్ చెల్లింపులు
హైదరాబాద్, జూలై 31: టాటా స్కై చందాదారుల కోసం మొదటిసారిగా క్యుఆర్ కోడ్ ఆధారిత మొబైల్ చెల్లింపులను ఏంవీసా సహకారంతో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వీసా భారత్ దక్షిణ ఆసియా విభాగం కంట్రీ మేనేజర్ టిఆర్ రామచంద్రన్ తెలిపారు. టాటా స్కై వినియోగదారులు తమ ఇండ్లలోని టీవీ తెరపై ఒక క్యుఆర్ కోడ్ను తమ మొబైల్ ఫోన్ ద్వారా స్కానింగ్ చేసి లేదా మైటాటాస్కై.కామ్ పై ఆన్లైన్ ద్వారా తమ ఖాతాను తేలికగా రీ చార్జ్ తీసుకునే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందన్నారు. ఎంవీసా చెల్లింపు పరిష్కారం ద్వారా దేశంలోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఉన్న 17 మిలియన్ల వినియోగదారులకు లబ్ధి చేకూరనుందన్నారు.
హెల్త్కేర్ ప్రొఫెషనల్స్ కోసం
ఐఐఎం బెంగళూరుతో అపోలో ఒప్పందం
హైదరాబాద్, జూలై 31: హెల్త్కేర్ రంగంలో మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ను అందించేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అపోలో మెడ్ స్కిల్స్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులోభాగంగా జనరల్ మేనేజ్మెంట్ కోర్సులో సర్ట్ఫికేట్ ప్రొగ్రాంను ఆఫర్ చేస్తున్నట్లు ఐఐఎం బెంగళూరు తెలిపింది. ఆగస్టు 2 నుంచి ఈ కోర్సు బెంగళూరులోని ఐఐఎం క్యాంపస్లో ప్రారంభమవుతుంది.
యాక్సిస్ బ్యాంకు కస్టమర్లకు
టాటా ఎఐజి ట్రావెల్ బీమా
హైదరాబాద్, జూలై 31: సమగ్ర ట్రావెల్ బీమా పాలసీని టాటా ఎఐజి జనరల్ ఇన్స్యూరెన్స్ ప్రకటించింది. దేశీయ ప్రైవేట్రంగ బ్యాంకింగ్ సంస్థ యాక్సిస్ బ్యాంకు కస్టమర్లకు ఈ స్కీం వర్తిస్తుందని, దీనికి హ్యాపీ హాలిడేస్ ప్యాకేజీగా నామకరణం చేసినట్లు టాటా ఎఐజి తెలిపింది. విదేశాలకు వెళ్లే యాక్సిస్ బ్యాంకు కస్టమర్లు మొబైల్ ద్వారా బ్యాంకు యాప్ను డౌన్ లోడ్ చేసుకుని బీమాను పొందవచ్చునని సూచించింది. ఇందులో ట్రిప్ అసిస్టెంట్ సర్వీసు, ట్రావెల్ బీమా ప్లాన్స్, అత్యవసర సహాయ సర్వీసులు, ఫ్రీ ఇంటర్నేషనల్ కాలింగ్ కార్డులు, హోటళ్లకు డిస్కౌంట్ల ఆఫర్ ఉన్నాయ.