జిఎస్టి బిల్లు కీలకం
Published Monday, 1 August 2016న్యూఢిల్లీ, జూలై 31: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) గాను ప్రముఖ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలతోపాటు రాజ్యసభలో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్టి) బిల్లు పరిణామాలు ఈ వారం మార్కెట్ ట్రేడింగ్ను ప్రధానంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్ర, ఇండియన్ బ్యాంక్, టాట పవర్, గ్లాక్సోస్మిత్క్లైన్ కన్జ్యూమర్ హెల్త్కేర్ తదితర సంస్థలు ఈ వారం తమ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ క్రమంలో మదుపరులు తమ పెట్టుబడులపై ఈ ఫలితాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవచ్చని పలువురు మార్కెట్ విశే్లషకులు అంటున్నారు. అయతే అంతకంటే ఎక్కువగా పార్లమెంట్లో జిఎస్టి అంశం మార్కెట్ తీరుపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. సుదీర్ఘకాలం నుంచి పెండింగ్లో ఉన్న జిఎస్టి ఆమోదం కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది తెలిసిందే. లోక్సభలో ఆమోదం పొందిన క్రమంలో ఈ వారం రాజ్యసభకు బిల్లు రానుంది. దీంతో బిల్లుకు సంబంధించి ఎలాంటి అనుకూల సంకేతాలు వచ్చినా మార్కెట్లు లాభాల్లో దూసుకుపోవడం ఖాయమనే అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అలాగే ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మార్కెట్లు అదే రీతిలో స్పందించవచ్చని పేర్కొంటున్నారు. ఇక వర్షపాతం వివరాలు కూడా మార్కెట్ పోకడను నిర్ణయించవచ్చంటున్న నిపుణులు.. ఎప్పటిలాగే అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ మార్కెట్ల కదలికలు, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ, గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు, విదేశీ మదుపరుల పెట్టుబడులు మార్కెట్లపై ప్రభావం చూపుతాయని వివరిస్తున్నాయి. అలాగే జూలై నెలకుగాను ఆటోరంగ సంస్థలు ప్రకటించే అమ్మకాల వివరాలు కూడా మదుపరుల పెట్టుబడులను ప్రభావితం చేస్తాయని అంటున్నారు. ‘ఆయా సంస్థలు ప్రకటించే త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, పార్లమెంట్లో జిఎస్టి రాజ్యాంగ సవరణ బిల్లు మార్కట్ ట్రేడింగ్లో కీలకం’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. ఆటోరంగ సంస్థలు వెల్లడించే విక్రయ గణాంకాలూ కీలకమేనన్నారు. ‘త్రైమాసిక ఫలితాలు, విదేశీ మదుపరుల పెట్టుబడులు మార్కెట్ కదలికలను శాసించవచ్చు.’ అని దేశవ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. రైతాంగంలో ఆనందం వ్యక్తమవుతోంది. దేశ వృద్ధిరేటులో ప్రధాన పాత్ర పోషించే వ్యవసాయ రంగం లాభాల్లో నడిచే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇక పార్లమెంట్లో కీలక బిల్లులు ఆమోదం కావాల్సి ఉంది. అవి ఆమోదం పొందితే మార్కెట్లు నూతన స్థాయిలను అందుకోవచ్చు.’ అని క్యాపిటల్వయా గ్లోబల్ రిసెర్చ్ లిమిటెడ్ వ్యవస్థాపక సిఇఒ రోహిత్ గుప్తా అన్నారు. కాగా, గత వారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్ 248.62 పాయంట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 97.30 పాయంట్లు చొప్పున లాభపడినది తెలిసిందే.
అదనపు పన్ను ఉపసంహరణతో
జిఎస్టి ఆమోదం సులభం
నిపుణుల అభిప్రాయం
న్యూఢిల్లీ, జూలై 31: వివాదాస్పద ఒక శాతం అదనపు అంతరాష్ట్ర పన్నును తొలగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రతిపాదిత జాతీయ అమ్మకాల పన్ను లేదా వస్తు, సేవల పన్ను (జిఎస్టి) పార్లమెంట్లో ఆమోదం పొందడం చాలా సులువైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక అతిపెద్ద పరోక్ష పన్ను సంస్కరణగా అభివర్ణిస్తున్న జిఎస్టి రాజ్యాంగ సవరణ బిల్లు ఈ వారం రాజ్యసభకు రానుంది. సుదీర్ఘకాలం నుంచి పెండింగ్లో ఉన్న ఈ బిల్లు ఆమోదానికి మోదీ సర్కారు తీవ్రంగా శ్రమిస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాన అడ్డంకిగా మారిన ఒక శాతం అదనపు పన్నును తొలగించడానికి కేంద్రం అంగీకరించడంతో ఇక బిల్లు ఆమోదం పొందగలదన్న ఆశాభావాన్నీ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ బిల్లును అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తుండగా, ఇప్పటికే ప్రభుత్వానికి మెజారిటీ ఉన్న లోక్సభలో జిఎస్టి బిల్లు ఆమోదం పొందినది తెలిసిందే. అయితే అంతగా మెజారిటీ లేని రాజ్యసభలో ఆమోదానికి కష్టపడాల్సి వస్తోంది. దీంతో ప్రతిపక్షాలు, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను తప్పక పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి కేంద్రానికి వచ్చిపడింది. చివరకు జిఎస్టి అమలుతో తొలి ఐదేళ్లలో రాష్ట్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లినా అందుకు పరిహారం చెల్లిస్తామని కూడా కేంద్రం హామీ ఇవ్వాల్సి వచ్చింది.