పర్యాటకులకు కనువిందు చేసిన కుంటాల జలపాతం
Published Monday, 1 August 2016ఆదిలాబాద్, జూలై 31: భారీ వర్షాలతో కుంటాల జలపాతం పరవళ్లను తొక్కుతూ జాలువారే అందాలు పర్యాటకులను ఆదివారం కనువిందు చేశాయి. ఎతె్తైన రాతికొండల నుండి ఎగిసిపడుతున్న జలసిరులను వీక్షిస్తూ పర్యాటకులు ఆనందసాగరంలో మైమర్చిపోయారు. ఆదివారం సెలవు దినం కావడం, పైగా సోమవారం కూడా ప్రభుత్వం బోనాల పండగ సెలవు దినంగా ప్రకటించడంతో పొరుగునే గల మహారాష్టల్రోని నాందెడ్, యవత్మాల్ జిల్లాల నుండి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాల నుండి కుటుంబాలతో కలిసి కుంటాల జలపాతానికి తరలిరావడంతో జనారణ్యం జనం తాకిడితో సందడిగా మారింది. పై నుండి ఎగిసిపడుతున్న జలసిరులకు పిల్లలు సంబరపడిపోయారు. పర్యాటకులు జలపాతం అందాలతో పాటు పచ్చని అడవులను చూస్తూ పులకించిపోయారు. ముఖ్యంగా యువకులు కుంటాల జలపాతానికి భారీ సంఖ్యలో క్యూకట్టడంతో ఆదివారం జలపాతం పరిసరాలు వాహనాలతో నిండిపోయాయి. ఈ సంధర్భంగా పర్యాటకులు జలపాతం అందాలను తమ కెమెరాలు, సెల్ఫోన్లలో బందించి పరవశించిపోయారు. మరో రెండు రోజుల పాటు జలపాతం వద్ద తాకిడి ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని టూరిజం అధికారులు తెలిపారు. గత వారం నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడు జలపాతం కాలుజారి మృతి చెందిన సంఘటన నేపథ్యంలో ఈసారి ముందు జాగ్రత్త చర్యగా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచి పర్యాటకులను దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.