మొక్కల సంరక్షణకు ప్రజల భాగస్వామ్యం
Published Monday, 1 August 2016విజయనగరం(టౌన్),జూలై 31: హుదూద్ తుఫానులో తీవ్రంగా జిల్లాలో పచ్చదనం దెబ్బతింది. పర్యవసానంగా పర్యావరణ సమతుల్యం లోపించి ఎన్నడూ లేనివిధంగా పట్టణ , గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎండలతో అల్లాడిపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కాస్తో కూస్తో పచ్చదనం, చెట్లు చేమలు కనిపిస్తాయి. కాంక్రీట్ జంగిల్ లాంటి పట్టణాల్లో పచ్చదనం మచ్చుకైనా కానరావడంలేదు. రహదారుల నిర్మాణంలో, లేదా ఇళ్ల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల మాటున చెట్లను తొలగించేస్తున్నారు. గతంలో పట్టణంలో అక్కడక్కడా పచ్చని చెట్లు ఉండేవి. ఇటీవల అటువంటి పచ్చదనం కనుమరుగైంది. దీనికితోడు హుదూద్ తుఫానులో వేలాదిగా మొక్కలు, చెట్లు నేలకొరిగాయి. తిరిగి వాటిని పునరుద్దరించడంలో భాగంగా విరివిగా మొక్కలు పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఇపుడిపుడే పట్టణ ప్రజల్లో మొక్కల పెంపకం, వాటి విలువపట్ల అవగాహన పెరిగి వాటిని సంరంక్షించే చర్యలకు పూనుకుంటున్నారు. వేసవి కాలంలో ఉడాకాలనీలో నాటిన మొక్కలకు ప్రాణాధారమైన నీటిని సమీప కాలనీ ప్రజలు పోసి అవి వాడి పోకుండా పెంచారు. ఫలితంగా సాలిపేట నుండి అయ్యన్నపేట వెళ్లే దారివెంబడి పచ్చదనంతో పాటు ఫలసాయం ఇచ్చే మామిడి, వేప, రావి మొక్కలు పెరిగాయి. వనం-మనంలో పెద్దఎత్తున వివిధ వర్గాల ప్రజలు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడితో ఆగిపోకుండా వాటిని సంరక్షించేందుకు వెదురుతో అల్లిన ట్రీగార్డులను ఏర్పాటుచేసి మొక్కలను పెంచడంలో ముందుంన్నారు. ప్రతి ఒక్కరిలో పర్యవరణం పట్ల అవగాహన పెరిగితే అనతి కాలంలోనే విజయనగరం హరితవనం అవుతుందనడంలో సందేహంలేదు.