ఇక ప్రతి సోమవారం ‘డయల్ యువర్ కలెక్టర్’
Published Monday, 1 August 2016విజయనగరం, జూలై 31: జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వివేక్యాదవ్ ప్రజాసమస్యల పరిష్కారం కోసం కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి సోమవారం ఉదయం 9 నుంచి 10గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ పేరిట కార్యక్రమాన్ని సోమవారం నుంచి ప్రారంభించబోతున్నారు. ఇప్పటివరకు ప్రతి సోమవారం కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గ్రీవెన్స్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను అక్కడే ఉండే ఆయా శాఖల అధికారులకు అప్పగించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో పరిష్కారానికి నోచుకోని సమస్యలే జిల్లాకేంద్రంలో జరిగే గ్రీవెన్స్లో వస్తుండటంతో చాలామటుకు వీటి పరిష్కారం ఫైళ్లకే పరిమితం అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కలెక్టర్ కొత్తగా నిర్వహిస్తున్న డయల్ యువర్ కలెక్టర్లో ఏ మేరకు ప్రజాసమస్యలు పరిష్కారం అవుతాయోనని అందరూ ఆసక్తిగా చూసే పరిస్థితి ఏర్పడింది.