ఆధ్యాత్మికతతోనే మానసిక ఉల్లాసం
Published Monday, 1 August 2016అమరాపురం, జూలై 31 : సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకుని మానసిక ఉల్లాసం పొందాలని రాయలసీమ థియోసఫికల్ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ కార్యదర్శి కాంతారావు, బళ్లారి థియోసఫికల్ సభ్యులు రంగయ్యశెట్టి అన్నారు. ఆదివారం స్థానిక థియోసఫికల్ సంస్థ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవుడు ఎప్పుడూ ఏదో పనిలో నిమగ్నం కావడం వల్ల ఒత్తిడి పెరిగి పలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. దీన్ని అధిగమించడానికి రోజూ గంట పాటు ధ్యానం చేయడం ద్వారా మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం కలిగి ఉల్లాసంగా ఉండవచ్చన్నారు. మనిషిలోని అజ్ఞానాన్ని తొలగించేది ధ్యానమేనన్నారు. మానవుడు సంస్కృతం, పాండిత్యం, సత్యం, ధర్మం, ఓం, స్వస్తిక్, చిహ్నం వంటి వాటిపై దృష్టి సారించాలన్నారు. దీంతో ఆధ్యాత్మికత పెరగడమే కాక మనిషి అవరోధాలను అధిరోహించవచ్చన్నారు. కార్యక్రమంలో సభ్యులు డాక్టర్ బసవరాజు, చంద్రప్ప, దొడ్డీరప్ప, నాగభూషణం, బసవలింగప్ప, చంద్రకీర్తి తదితరులు పాల్గొన్నారు.