అశోక చక్రవర్తి బాటలో అటవీశాఖ పయనం
Published Monday, 1 August 2016సారవకోట, జూలై 31: అశోకుడు చెట్లు నాటించెను-రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటేను. ఈ వ్యాక్యాలను ప్రాధమిక విద్యాస్థాయిలో పాఠ్యాంశాల రూపంలో చదువుకున్నాం. వీటిని నిజం చేస్తూ సామాజిక అటవీశాఖ తాజాగ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం విశేషం. నాలుగేళ్ల కిందట రోడ్డు విస్తరణ పనులు జరిగినప్పుడు మండలంలోని అంగూరు నుండి నౌతల జంక్షన్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పురాతన వృక్షాలను తొలగించారు. ఈవృక్షాలను అశోక చక్రవర్తి నాటినట్లుగా పూర్వీకులు తెలిపారు. చెట్లు తొలగించిన నాలుగేళ్ల తరువాత పర్యావరణ పరిరక్షణకు ప్రయాణీకులకు నీడకల్పించేందుకు వన మహోత్సవం సందర్భంగా సామాజిక అటవీ శాఖాధికారులు ఈ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం జగ్గయ్యపేటనుండి చిన్న కిట్టాలపాడు గ్రామం వరకు ఈకార్యక్రమాన్ని అటవీశాఖాధికారులు పూర్తి చేశారు. ఇప్పటికైనా అశోకచక్రవర్తిని స్ఫూర్తిగా తీసుకొని సామాజిక అటవీ శాఖాధికారులు బృహత్కరమైన సామాజిక కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయం. ఇదే తరుణంలో గ్రామాలకు ఉన్న రహదారులకు ఇరువైపులా ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని మండలంలో పెద్ద ఎత్తున చేపట్టారు.