అందరికీ తొలి గురువు అమ్మే..
Published Monday, 1 August 2016మచిలీపట్నం (కల్చరల్), జూలై 31: ప్రతి ఒక్కరికీ తొలి గురువు మాతృమూర్తి అని మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి డా. ఎం రామకృష్ణ అన్నారు. స్థానిక హిందూ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం శ్రీ బాలాజీ విద్యాలయం పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డా. రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమన్నారు. ప్రతిఒక్కరూ తల్లి, తండ్రి, గురువులను పూజించాలన్నారు. తల్లిదండ్రులు నిరంతరం తమ చిన్నారుల ప్రవర్తనను పరిశీలిస్తూ అభివృద్ధికి తగిన బాటలు వేయాలన్నారు. ఉపాధ్యాయులు క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలన్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డలకు ప్రేమ, మమకారాలను అందిస్తూ వారి ఆప్యాయతను చూరగొన్నప్పుడు వృద్దాశ్రమాల ఆవశ్యకత ఉండదన్నారు. 36 సంవత్సరాలుగా విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో బాలాజీ విద్యాలయం చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎస్ రజిని మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో అమ్మకి గల స్థానం ఉన్నతమన్నారు. విద్యార్థులు చిన్న చిన్న సమస్యలకు బెదిరిపోకుండా పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదన్నారు. సినీ గేయ రచయిత భువనచంద్ర మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులకు, రచయితలకు బందరు పుట్టినిల్లన్నారు. గురువులను గౌరవించే సంప్రదాయం మనదని, భారతీయ న్యాయ వ్యవస్థ అత్యున్నతమైనదన్నారు. ప్రతి వ్యక్తి గుండెలో దేశాన్ని రక్షించే సైనికుల కవాతు ధ్వని వినిపిస్తుందన్నారు. ఆయన ఆలపించిన జయంబు నిశ్చయమ్మురా.., అడుగేసేయ్ అశాంతి నుండి ప్రశాంతి వైపుకు.. అనే గేయాలు ఆకట్టుకున్నాయి. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన కొమరగిరి జయప్రద మాట్లాడుతూ బాల్య నుండే విద్యార్థులు ఆధ్యాత్మిక చింతన, నైతిక విలువలు పెంపొందించుకోవాలన్నారు. అనంతరం విద్యలో అత్యధిక ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు, జ్ఞాపికలు అందచేశారు. విద్యాలయం ప్రిన్సిపాల్ కొమరగిరి చంద్రశేఖర్ అధ్యక్షతన ప్రముఖ సినీ నటుడు ఆదిత్య ఓం, చలనచిత్ర నిర్మాత విజయవర్మ, కొమరగిరి శ్యాంప్రసాద్ పాల్గొన్నారు.