కమాండ్ టవర్లకు టెండర్ల ప్రక్రియ
Published Monday, 1 August 2016హైదరాబాద్, జూలై 31: హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ టవర్స్కు టెండర్ల ప్రక్రియ మొదలైంది. బిడ్డర్లు ఆగస్టు 20కల్లా టెండర్ల దాఖలు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం రూ. 350 కోట్లతో 83.45 మీటర్ల ఎత్తుతో ఐదు బ్లాకులుగా పోలీస్ కమాండ్ కంట్రోల్ టవర్స్ను నిర్మించనుంది. గరిష్ఠంగా 21 నెలల కాల పరిమితిలో టవర్ల నిర్మాణం పూర్తి చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఎల్ అండ్ టి, షాపూర్జీ పల్లోంజీ సంస్థల్లో ఒకదానికి ఈ కాంట్రాక్టు దక్కే అవకాశం ఉంది. కాంట్రాక్టర్ల షార్ట్ లిస్టుకు ముందు నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ కూడా పోటీలో ఉన్నా ప్రభుత్వ మార్గదర్శకాలు భర్తీ చేయని కారణంగా ఆ కంపెనీ బరిలోనుంచి వైదొలగాల్సి వచ్చినట్టు సమాచారం. ప్రభుత్వ సెక్టార్లో గతంలో పనిచేసిన అనుభవం, నిర్మాణ రంగంలో అత్యాధునిక పరిజ్ఞానం కలిగి ఉండటం, భవనాల డిజైన్ అండ్ బిల్డ్ లాంటి అంశాల ప్రామాణికంగా ప్రభుత్వం కాంట్రాక్టర్ల షార్ట్ లిస్టును తయారు చేసింది. గత ఏడాది నవంబర్ 22న ముఖ్యమంత్రి కెసిఆర్ బంజారాహిల్స్లో పోలీస్ కమాండ్ టవర్స్కు శంకుస్థాపన చేశారు. 350 కోట్లతో చేపట్టే టవర్స్ నిర్మాణ పనులను టెండర్ ఖరారైన రోజు నుంచి 21 నెలల లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది.