విఎస్యూ వెబ్సైట్ హ్యాక్
Published Monday, 1 August 2016వేదాయపాళెం, జూలై 31: నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్శిటీకి సంబంధించిన వెబ్సైట్ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. తమ వెబ్సైట్ను ఎవరో హ్యాక్ చేశారని గుర్తించిన అధికారులు ఆదివారం ఉదయం 10.30 గంటలకు వెబ్సైట్ను పూర్తిగా నిలిపివేశారు.
హెచ్చరికలతో పేజీ దర్శనం
యూనివర్శిటీ వెబ్సైట్ను హ్యాకింగ్ చేసిన వ్యక్తులు ఇంగ్లీషు అక్షరాలతో రాసిన ఓ పేజీని ఉంచారు. ఆ పేజీతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కళ్లకు గంతలు కట్టి ఉన్న ఫొటో, ముఖంపై గాయాలతో ఉన్న ఫొటో, మంచంపై పడుకుని ఉన్న ఓ యువతి ఫొటోలను ఉంచారు. ఇంగ్లీషులో రాసి ఉన్న పేజీలో గుర్తుతెలియని వ్యక్తులు పలు విషయాలను సూచించారు. ఇటీవల కాశ్మీర్లో జరుగుతున్న దాడుల్లో కాశ్మీర్ వాసులపై అన్యాయంగా కాల్పులు జరుపుతున్నారంటూ వ్యాఖ్యానించి ఉన్నారు. కాల్పుల వల్ల ఇప్పటికే 200 మంది చూపు కోల్పోయారని, లక్షలాది మంది కాశ్మీరీలు రెండు వారాలుగా నరకం అనుభవిస్తున్నారని రాసి ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బొమ్మ పక్కనే మోదీ చర్యలను తాము చూస్తూ భరించలేమంటూ డాక్టర్ సయ్యద్ ఖాన్దే పేరుమీద హెచ్చరికలు చేసి ఉన్నారు. ఇక హీరో షారూఖ్ఖాన్ ముఖంపై గాయాలతో ఉన్న ఫొటో కింద జునైద్ నజీర్ పేరుతో హెచ్చరికలు ఉన్నాయి. కాశ్మీర్కు సంబంధించిన హింషా అనే 14 ఏళ్ల యువతిపై పోలీసులు చేసిన దాడిలో ఆ పాప ఇలా గాయాలపాలై చూపు కోల్పోయిందని గాయాలతో ఉన్న యువతి ఫొటోను వారు ఆప్లోడ్ చేసిన పేజీలో ఉంచారు. ఇంత జరిగినా విక్రమ సింహపురి యూనివర్శిటీ అధికారులు నిర్లక్ష్యంగానే ఉన్నారు. తమ వెబ్సైట్ను గుర్తుతెలియని వ్యక్తులు శనివారం సాయంత్రం 4 గంటలకు హ్యాకింగ్ చేస్తే కనీసం స్పందించినవారే లేరు.
విక్రమ సింహపురి యూనివర్శిటీ వెబ్సైట్లో దర్శనమిచ్చిన ఫొటోలు