గడువులోగా పూర్తిచేయాలి
Published Monday, 1 August 2016నల్లగొండ, ఆగస్టు 1: తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా పుష్కరాలు ఈ నెల 12నుండి 23వరకు తొలిసారిగా ఘనంగా నిర్వహించేందుకు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం నిర్ధేశిత గడువు ఈ నెల 5వ తేదిలోగా పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్రెడ్డి, జిల్లా మంత్రి జి.జగదీష్రెడ్డిలు అధికారులను ఆదేశించారు. సోమవారం వారు జిల్లాలో మఠంపల్లి, వాడపల్లిలలో కృష్టా పుష్కర ఘాట్లను, వౌలిక వసతుల పనులను పరిశీలించిన పిదప సాయంత్రం కలెక్టరేట్లో అధికార యంత్రాంగంతో పుష్కరాల ఏర్పాట్ల పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతు ఇప్పటిదాకా ఘాట్ల పనులు మినహా ఆర్అండ్బి, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్డబ్ల్యుఎస్, పోలీస్ శాఖలకు సంబంధించిన పనుల్లో ఆలస్యం నెలకొందన్నారు. పుష్కర భక్తులకు ఇబ్బంది కల్గకుండా రోడ్లు, పార్కింగ్, హోల్డింగ్స్, మరుగుదొడ్లు, మంచినీటి వసతి, పారిశుద్ధ్యం పనులను సకాలంలో పూర్తి జరిగేలా అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు జరిపించాలన్నారు. సీఎం కెసిఆర్ కృష్ణా పుష్కరాల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ఏవైనా లోటుపాట్లు తలెత్తితే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.
అంతకుముందు మంత్రులు కృష్ణా పుష్కరాల కోసం జిల్లా యంత్రాంగం రూపొందించిన ప్రత్యేక మొబల్ యాప్ను, పుష్కరాల ప్రచార పోస్టర్లు, విశేషాల బ్రోచర్లను మంత్రులు ఆవిష్కరించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపి గుత్తా సుఖేందర్రెడ్డి, కలెక్టర్ ఎన్. సత్యనారాయణ, జెసి సత్యనారాయణ, ఏజెసి వెంకట్రావు, ఎస్పీ ఎన్.ప్రకాశ్రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్. భాస్కర్రావు, పైళ్ల శేఖర్రెడ్డి, వేముల వీరేశం, గాదరి కిషోర్, రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, స్పెషల్ కలెక్టర్ నిరంజన్, డ్వామా పిడి దామోదర్రెడ్డి, డిఆర్డిఏ పిడి అంజయ్య, ఇరిగేషన్ ఎస్ఈ ధర్మానాయక్, ట్రాన్స్కో ఎస్ఈ బిక్షపతి, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ రమణతో పాటు వివిధ శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు.