నల్లగొండ మున్సిపాల్టీకి పదిన్నర కోట్లు
Published Monday, 1 August 2016నల్లగొండ టౌన్, ఆగస్టు 1: నల్లగొండ పట్టణం మున్సిపాల్టీ అభివృద్ధి పనుల కోసం ఐపిడిఎస్ స్కీమ్ కింద విద్యుత్ పనుల కోసం పదిన్నర కోట్లు మంజూరైనట్లుగా మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, ఎంపిపి పాశంరాంరెడ్డిలు తెలిపారు. నల్లగొండ మున్సిపాల్టీలో హైటెన్షన్వైర్లను తొలగించడం, అదనపు సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లు ఏర్పాటు, మున్సిపాల్టీ విలీన గ్రామాల్లో 24గంటల విద్యుత్ వంటి పనులకు ఈ నిధులు వెచ్చించినట్లుగా వారు తెలిపారు. కాగా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎంసెట్-2లీకేజిపై ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. రద్ధు వద్ధంటు, లికేజీపై చర్యలు తీసుకోవాలంటు పొంతన లేకుండా మాట్లాడటం తగదన్నారు. అసలు ఎంసెట్ విద్యపై మాట్లాడే అర్హత కోమటిరెడ్డికి లేదని ఆయన అసలు ఇంజనీరింగ్ ఉత్తీర్ణత కాకుండానే ఎన్నికల అఫిడవిట్లో ఇంజనీరింగ్ చదివానంటు పేర్కోని ప్రజలను మోసం చేసిన ఘనుడన్నారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ నాయకులు పట్టణ అధ్యక్షుడు అబ్బగోని రమేష్, కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్, డి.అశోక్సుందర్, నవీన్గౌడ్, ఖయ్యుంబేగ్, బొంత రేణుకాశ్రీనివాస్, ఎడ్ల గీత, కేసాని కవితావేణు, వేదశ్రీ శ్రీనివాస్, పెరికె ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.