ప్రతిష్టాత్మకంగా కృష్ణా పుష్కరాలు
Published Monday, 1 August 2016దామరచర్ల, ఆగస్టు 1: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి వచ్చిన కృష్ణా పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, విద్యుత్శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిలు తెలిపారు. సోమవారం మండలంలోని వాడపల్లి వద్దగల పుష్కరఘాట్లను పరిశీలించారు. మంత్రులకు దేవాదాయశాఖ వారు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటి చైర్మన్ సిద్ధయ్య మంత్రులకు శాలువాలతో సత్కరించారు. అనంతరం శివాలయ పుష్కరఘాట్ను పరిశీలించి ఇక్కడి ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పడవలో కృష్ణానదిలో నుండి ప్రయాణం చేసి అన్ని పుష్కరఘాట్లను పడవలో ఉండి చూశారు. అనంతరం వారు మాట్లాడుతూ భక్తులు కృష్ణా పుష్కరాలతో పునీతులు కావాలని, ఈనెల 12నుండి 23వరకు నిర్వహించే కృష్ణా పుష్కరాలలో ప్రతి ఒక్కరు పాల్గొని పుష్కరస్నానాలు చేయాలని వారు కోరారు. పుష్కరాలకు రూ.825కోట్లను కేటాయించడం జరిగిందని మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో మొత్తం 81ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వారు తెలిపారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రధాన రహదారి నుండి ప్రయాణించేటప్పుడు వాటికి అనుబంధంగా ఉన్న రోడ్ల వద్ద సూచికలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. కృష్ణానది వరద తక్కువగా ఉన్నందున భక్తులకు ఇబ్బందులు కలుగుతుందని గతంలో అనుకున్నామని, కాని ప్రస్తుతం నారాయణపూర్, ఆల్మట్టిడ్యాంలు పూర్తిస్థాయిలో నిండి జూరాల నుండి శ్రీశైలంకు 80వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని, నాగార్జునసాగర్ దిగవకు పుష్కరాల సందర్భంగా నీటిని విడుదల చేయడం జరుగుతుందని అవసరమైతే కర్ణాటక ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సంప్రదించి పుష్కరాలకు 25టిఎంసిల నీటిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరఘాట్లు దాదాపుగా పూర్తికావొస్తున్నాయని, మరుగుదొడ్లు నిర్మాణం త్వరలో పూర్తవుతుందని, కొత్త విధానం ద్వారా మరుగుదొడ్లను 45గంటల్లో పూర్తిచేసేందుకు అవకాశం ఉందని అన్నారు. వర్షాకాలం కావునా భక్తుల రద్దీని తట్టుకునేందుకు అన్ని రహదారులకు బైపాస్ను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. వాడపల్లి ఘాట్ 80శాతం మాత్రమే పూర్తయిందని, మిగిలినవి ఈనెల 5నాటికి పూర్తిచేసేందుకు అధికారులు సిద్ధంకావాలని అన్నారు. అనుకున్న సమయానికి ఘాట్ల పనులు పూర్తవుతాయని, మీనాక్షి అగస్తేశ్వరస్వామి ఆలయానికి రూ.25లక్షలు, లక్ష్మీనర్సింహాస్వామి ఆలయానికి రూ.17లక్షలు కేటాయించామని పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ప్రస్తుతం పూర్తిచేసిన వరకు పనులను నిలిపివేసి మిగతా పనులను పుష్కరాల అనంతరం చేపడ్తామని అన్నారు. ఆలయ ప్రాంతాల్లో గర్భగుడి బయట ఉత్సవ విగ్రహాలను ఏర్పాటుచేస్తామని వారు తెలిపారు.
వీరి వెంట ఎంపి గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు, జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, జెసి సత్యనారాయణ, ఎస్పి ప్రకాశ్రెడ్డి, ఎజెసి వెంకట్రావ్, ఐబి ఎస్ఇ ధర్మానాయక్, డిపిఆర్ఓ నాగార్జున, డిపిఓ ప్రభాకర్రెడ్డి, ఆర్డీఒ కిషన్రావు, జడ్పిటిసి శంకర్నాయక్, ఎంపిపి మంగమ్మ, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి అల్గుబెల్లి అమరేందర్రెడ్డి, ఎంపిటిసి కొండూటి మాధవిసిద్ధయ్య, సర్పంచ్ వరలక్ష్మీసుబ్బయ్య, డిఎస్పి రాంగోపాల్రావు, నాయకులు నారాయణరెడ్డి, వీరకోటిరెడ్డి, యూసుఫ్, సిఐలు రవీందర్, భిక్షపతి, వాడపల్లి ఎస్ఐ చరమందరాజు తదితరులు పాల్గొన్నారు.