సాగులో యువరైతు సరికొత్త ప్రయోగం.... రూ.2వేలతో కొత్త పరికరం
Published Monday, 1 August 2016నల్లగొండ రూరల్, ఆగస్టు 1: మానవుడు తల్చుకుంటే ఏమైనా సాధించవచ్చని, చిన్న పరికరంతో పంటల సాగులో ముందుకు సాగవచ్చని నల్లగొండ మండలం అప్పాజిపేటకు చెందిన యువరైతు మేక నర్సిరెడ్డి నిరూపించారు.
ఇతను కొన్ని సంవత్సరాలుగా తనకున్న నాలుగు ఎకరాల చెల్కలో పత్తి పంటలను సాగు చేస్తూ ఒసిటిఎల్ నార్కట్పల్లిలో పనిచేస్తుండేవాడు. ఇటీవల ఒసిటిఎల్ మూసివేయడంతో జీవనోపాధి కోసం కొంత సమయంలో వెల్డింగ్ వర్క్ చేస్తుండేవాడు. ఈ క్రమంలో అతనికి సరికొత్త ఆలోచన రావడంతో కార్యరూపంలో పెట్టాడు. చెల్కలలో గడ్డి తొలగించే సమయంలో, ఎరువులు చల్లే సమయంలో ‘దంతె’ అనే పేరుగల వ్యవసాయ పరికరాన్ని ఉపయోగించే విషయం విదితమే.... అయితే ఈ దంతె పరికరానికి పై భాగంలో ఇనుప రేకుతో తయారు చేసిన బాక్స్ను ఏర్పాటు చేసి రెండు వైపులా రెండు సాల్లకు ఎరువులు పడేందుకు వీలుగా ఇనుప కడ్డీలు, ప్లాస్టిక్ పైపులను ఉపయోగించి సరికొత్త పరికరాన్ని నర్సిరెడ్డి తయారు చేశారు. ఈ పరికరం తయారుకు రెండు వేయిల రూపాయల పైగా ఖర్చు అయిందన్నారు. దీంతో కూలీల కొరతను నివారించుకోవచ్చని, సమయం కూడా ఆదా అవుతుందన్నారు. దంతె కొట్టడంతో పాటు ఎరువులు వేయవచ్చన్నారు.