ఆర్బిఐ నూతన లైసెన్సింగ్ విధానం
Published Tuesday, 2 August 2016ముంబయి, ఆగస్టు 1: బ్యాంకింగ్ రంగంలో కొత్తవారికి మరింత అవకాశాన్నిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) సోమవారం ఆన్-ట్యాప్ యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్సు విధానాన్ని ప్రకటించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం 500 కోట్ల రూపాయల ప్రారంభ మూలధనంతో ఏ సంస్థ అయినా ప్రైవేట్ బ్యాంకును పెట్టవచ్చు. బ్యాంక్ నికర విలువ ఎల్లప్పుడూ 500 కోట్ల రూపాయలకు తగ్గకూడదు. ఆసక్తి ఉన్న సంస్థలు ఆర్బిఐకి ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, భారీ పారిశ్రామిక సంస్థలకు మాత్రం ఈ అవకాశం లేదు. అయితే కొత్త బ్యాంకుల్లో 10 శాతం వరకు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో 27 ప్రభుత్వరంగ బ్యాంకులు, 24 ప్రైవేట్రంగ బ్యాంకులున్నాయి. ఆర్బిఐ గవర్నర్గా రఘురామ్ రాజన్ మూడేళ్ల క్రితం బాధ్యతలు చేపట్టినప్పుడు తన ప్రధాన సంస్కరణల్లో బ్యాంక్ లైసెన్సింగ్ను ఆన్-ట్యాప్ చేయాలన్నది కూడా ఒకటని ప్రకటించినది తెలిసిందే.