పురవ్ రాజా-దివిజ్ శరణ్కు ఎటిపి చాలెంజర్ టైటిల్
Published Tuesday, 2 August 2016ముంబయి, ఆగస్టు 1: స్పెయిన్లోని సెగోవియాలో జరిగిన ఎటిపి చాలెంజర్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు పురవ్ రాజా, దివిజ్ శరణ్ డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. ఈ టోర్నీలో మూడో సీడ్ జోడీగా బరిలోకి దిగిన వీరు ఆదివారం రాత్రి జరిగిన డబుల్స్ ఫైనల్ పోరులో జోవాక్విన్ మునోజ్ హెర్నాండెజ్ (స్పెయిన్), అకీరా సాంటిల్లన్ (జపాన్) జోడీపై విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో రాజా-శరణ్ 6-4, 4-6, 10-8 తేడాతో ప్రత్యర్థులను మట్టికరిపించి టైటిల్ను కైవసం చేసుకున్నారు. ఇటీవల మాంచెస్టర్తో పాటు లండన్ శివార్లలోని సర్బిటన్లో జరిగిన టోర్నీలో టైటిళ్లు కైవసం చేసుకున్న రాజా-శరణ్కు గత రెండు నెలల్లో ఇది మూడో టైటిల్. ఆదివారం ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం రాజా మాట్లాడుతూ, కఠోర శ్రమతో కలసికట్టుగా ముందుకు సాగుతున్న తమకు రెండు నెలల్లో మూడో టైటిల్ లభించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పాడు. కాగా, మున్ముందు కూడా తాము మరిన్ని టైటిళ్లు సాధించగలమని ఆశిస్తున్నట్లు శరణ్ తెలిపాడు.