ఒలింపిక్స్కు వెళ్లేది నర్సింగే
Published Tuesday, 2 August 2016న్యూఢిల్లీ, ఆగస్టు 1: డోపింగ్ వ్యవహారంలో నాడా విచారణ కమిటీ సోమవారం నర్సింగ్ యాదవ్కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ) సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ తీర్పుతో నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్లో పాల్గొనేందుకు మార్గం సుగమమైందని డబ్ల్యుఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పేర్కొన్నాడు. కొద్ది రోజుల క్రితం డోపింగ్ కుంభకోణం తెరమీదికి రావడంతో రియో ఒలింపిక్స్ 74 కిలోల రెజ్లింగ్ విభాగంలో భారత కోట బెర్తును కాపాడుకునేందుకు నర్సింగ్ యాదవ్ స్థానంలో డబ్ల్యుఎఫ్ఐ ప్రవీణ్ రాణాను ఎంపిక చేసిన విషయం విదితమే. అయితే డోపింగ్ అభియోగాల నుంచి నర్సింగ్ యాదవ్ బయటపడితే ప్రవీణ్కు బదులుగా అతడినే ఒలింపిక్స్కు పంపుతామని భారత రెజ్లింగ్ సమాఖ్య యుడబ్ల్యుడబ్ల్యు (యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్)కి స్పష్టం చేసిందని బ్రిజ్ భూషణ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం నాడా విచారణ కమిటీ నర్సింగ్ యాదవ్కు క్లీన్ చిట్ ఇచ్చి డోపింగ్ ఆరోపణల నుంచి విముక్తి కల్పించడంతో అతను రియో ఒలింపిక్స్లో పాల్గొంటాడని గట్టిగా విశ్వసిస్తున్నామని బ్రిజ్ భూషణ్ తెలిపాడు.
చిత్రం.. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్