ఎంపీ శశికళ పుష్పను బహిష్కరించిన అన్నాడిఎంకె
Published Tuesday, 2 August 2016చెన్నై/న్యూఢిల్లీ, ఆగస్టు 1: అన్నాడింకె ఎంపి శశికళ పుష్పను ఆ పార్టీ అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్టీ నుంచి సోమవారం బహిష్కరించారు. ఢిల్లీ విమానాశ్రయంలో శనివారం నాడు తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డిఎం కెకు చెందిన తోటి పార్లమెంట్ సభ్యుడు త్రిచి శివ చెంప చెళ్లుమనిపించిన ఆరోపణలపై శశికళను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేస్తూ ‘‘రాజ్యసభలో ఎంపిగా ఉన్న శశికళ పార్టీ సిద్ధాంతాలు, విలువలను ఉల్లంఘించటం, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించిన కారణంగా ఆమెను పార్టీలోని అన్ని పదవుల నుంచి తప్పించటం జరిగింది. పార్టీ కార్యకర్తలు ఎవరూ ఆమెతో ఎలాంటి అనుబంధాన్ని కొనసాగించరాదు’’ అని పేర్కొన్నారు. దీనిపై రాజ్యసభలో సోమవారం హైడ్రామా కొనసాగింది. రాజ్యాంగబద్ధమైన పదవి నుంచి తనను బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. ముందుగా ఆమె వెల్లోకి దూసుకుపోయి తనను ఒక ప్రకటన చేయటానికి అనుమతించాల్సిందిగా చైర్మన్ను కోరారు. ఆ తరువాత పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. తనకు తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రాణ హాని ఉన్నదని, తనను ఒక నేత కొట్టారని ఆమె ఆరోపించారు. అయితే ఆమెను ఎవరు కొట్టారన్నదానిపై ఆమె వివరణ ఇవ్వలేదు. విమానాశ్రయంలో జరిగిన ఘటనలతో తన రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనను పార్టీ వేధిస్తోందని ఆమె పేర్కొన్నారు. తాను రాజీనామా చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరింపులు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. ఒక ఎంపికే ఇలాంటి పరిస్థితి ఉంటే దేశంలో మహిళలకు రక్షణ ఏం ఉంటుందని ఆమె రాజ్యసభలో ప్రశ్నించారు.