వాళ్లను మాకప్పగించండి
Published Tuesday, 2 August 2016నోయిడా, ఆగస్టు 1: బులంద్షహర్లో తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను తమకు అప్పగించాలని, వారిని ప్రజల మధ్యలో నిలబెట్టి కాల్చిపారేస్తామని బాధితుల బంధువులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ను కోరారు. ఢిల్లీ-కాన్పూర్ జాతీయ రహదారిపై జరిగిన ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా విస్మయం కలిగించిన సంగతి తెలిసిందే. బాధితురాలి భర్త ఆజ్తక్ చానల్తో మాట్లాడుతూ నిందితులను చంపేందుకు తన భార్య, కూతురికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘‘నేను ప్రభుత్వాన్ని, న్యాయస్థానాన్ని కోరుతున్నా. నిందితులను మాకు అప్పగించండి. వాళ్లను ప్రజల మధ్యలో కాల్చిపారేసేందుకు నా భార్య, కూతురిని అనుమతించండి. లేకపోతే మేమంతా విషం తాగి చస్తాం’’ అని ఆయన అన్నారు. ఇంత దారుణమైన నేరం పునరావృతం కాకుండా నిందితులను శిక్షించాలను కూతురు మామ డిమాండ్ చేశారు. కాగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు యూపి పోలీసులు తెలిపారు. వాళ్లను కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది.