పాక్తో ద్వైపాక్షిక చర్చలుండవు
Published Tuesday, 2 August 2016న్యూఢిల్లీ, ఆగస్టు 1: జమాత్ ఉద్ దావా (జెయుడి), హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలు బహిరంగ హెచ్చరికలు చేసినప్పటికీ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం పాకిస్తాన్కు వెళ్తున్నారు. సార్క్ దేశాల మంత్రుల స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు పాకిస్తాన్కు వెళ్తున్న రాజ్నాథ్ సింగ్ ఆ దేశ హోంమంత్రితో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు జరుపబోరని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సార్క్ దేశాల సమావేశంలో పాల్గొనేందుకు మాత్రమే రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కు వెళ్తున్నారని, ఈ సందర్భంగా పాకిస్తాన్ హోంమంత్రితో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు జరుపకూడదనే తన వైఖరిని భారత్ పునఃపరిశీలించడం లేదని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు. జెయుడి, హిజ్బుల్ చేసిన బహిరంగ హెచ్చరికల గురించి ప్రస్తావించగా, ‘రాజ్నాథ్ జీకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పాకిస్తాన్ది. ఉగ్రవాదులు బహిరంగంగా పాకిస్తాన్ను ఎలా నడుపుతున్నారనేదాన్ని ఇది సూచిస్తోంది’ అని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా, రాజ్నాథ్ సింగ్ను పాకిస్తాన్లో అడుగు పెట్టనీయొద్దని జెయుడి చీఫ్ హఫీజ్ సరుూద్ నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ‘అమాయక కాశ్మీరీల హత్యలకు బాధ్యుడయిన రాజ్నాథ్ సింగ్కు స్వాగతం పలికి, ఇప్పటికే గాయపడిన కాశ్మీరీలను అగౌరవపరుస్తారా? అని నేను పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను’ అని సరుూద్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. ‘కాశ్మీర్లో అత్యాచారాలకు వ్యతిరేకంగా యావత్ పాకిస్తాన్ ఒక పక్క నిరసన వ్యక్తం చేస్తుండగా, మరో పక్క పాకిస్తాన్ పాలకులు రాజ్నాథ్ సింగ్కు పూలమాలలు వేసి స్వాగతం చెబుతారా’ అని 2008లో ముంబయి నగరంపై జరిగిన దాడికి సూత్రధారి అయిన సరుూద్ పేర్కొన్నాడు. ఆగస్టు 3న రాజ్నాథ్ సింగ్ ఇస్లామాబాద్కు వస్తే జెయుడి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆయన హెచ్చరించాడు. దేశవ్యాప్తంగా నిరసన ధర్నాలతో పాటు ఇస్లామాబాద్, లాహోర్, కరాచి, పెషావర్, క్వెట్టా, ముల్తాన్, ఫైసలాబాద్, ముజఫరాబాద్ వంటి నగరాలలో ర్యాలీలు నిర్వహిస్తామని సరుూద్ పేర్కొన్నాడు.
జమ్మూకాశ్మీర్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ హతమైన తరువాత ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ సార్క్ సమావేశంలో పాల్గొనేందుకు పాకిస్తాన్కు వెళ్తున్నారు. వనీ ఎన్కౌంటర్ తరువాత కాశ్మీర్లో జరిగిన నిరసన ప్రదర్శనల సందర్భంగా 45 మంది చనిపోయిన విషయం తెలిసిందే.
చిత్రం.. పార్లమెంట్ వద్ద విలేఖరులతో మాట్లాడుతున్న కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్