సిబిఐ దర్యాప్తు జరిపించండి
Published Tuesday, 2 August 2016హైదరాబాద్, ఆగస్టు 1: ఎమ్సెట్-2 పేపర్ లీక్ కుంభకోణంపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ చేత విచారణ జరిపించాలని ఎబివిపి రాష్టక్రార్యదర్శి అయ్యప్ప డిమాండ్ చేశారు. సోమవారం నాడు ఆయన రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఎమ్సెట్ లీక్ కాదని, ఇది టిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల హయాంలో జరిగిన అతి పెద్ద స్కాం అని ఆరోపించారు. ఈ కుంభకోణం వెనుక టిఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్ద మనుషులు ఉన్నారని, మంత్రివర్గ సభ్యులను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఎమ్సెట్ -3 నిర్వహణకు ముందు అక్రమార్కులను గుర్తించి వారిపై చర్యలు చేపట్టాలని అన్నారు. ఇందుకు సిబిఐతోసమగ్ర దర్యాప్తు జరిపించాలని అయ్యప్ప డిమాండ్ చేశారు.
సిఐడి విచారణ తీరు చూస్తే నేరస్తులను బయటకు తీస్తున్నారా లేక పెద్ద నేరుస్తులను కాపాడుతున్నారా అనే అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వం దృష్టి అంతా ఇద్దరు మంత్రులు, ఇద్దరు అధికారులను కాపాడుకునే దిశగా ఉందని అన్నారు. విద్యాశాఖ బాధ్యులు చేస్తున్న తప్పులకు వేలాది మంది విద్యార్ధులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రతి విద్యార్ధితో ఐదారుసార్లు పరీక్షలు రాయిస్తున్నారని, పరీక్ష ప్రశ్నాపత్రం ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్కు ఒక్కసారి మాత్రమే అవకాశం ఇవ్వాలనే నిబంధనను సైతం ఉల్లంఘించినట్టు ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఎమ్సెట్ లీక్లో కార్పొరేట్ కాలేజీల హస్తంపై ఇంత వరకూ దర్యాప్తు మొదలు కాలేదని, దానికి కారణం ఏమిటో ప్రభుత్వ పెద్దలే చెప్పాలని అన్నారు.
చిత్రం.. హైదరాబాద్లో విలేఖరులతో మాట్లాడుతున్న ఎబివిపి నాయకులు