హైకోర్టు తాత్కాలిక సిజెగా జస్టిస్ రమేష్ రంగనాథన్
Published Tuesday, 2 August 2016హైదరాబాద్, ఆగస్టు 1: ఆర్థిక రంగంలో నిష్ణాతులు, ఉభయ తెలుగు రాష్ట్రాల హైదరాబాద్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథ్ను ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ నియమించింది. ఈ మేరకు న్యాయ శాఖ సంయుక్త కార్యదర్శి రాజేందర్ కశ్యప్ ప్రత్యేక గెజిట్ ప్రకటన విడుదల చేశారు. ఇంతకాలం తాత్కాలిక న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ దిలిప్ బాబాసాహెబ్ బోసలే బదిలీ కావడంతో రంగనాధ్ను నియమించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ హైకోర్టులో సింగిల్ జడ్జిగా కొనసాగుతున్నారు. 1958 జూలై 28వ తేదీన ఢిల్లీలో జన్మించిన రంగనాధ్ 1977లో పట్ట్భద్రులయ్యారు. 1981లో కామర్స్లో పిజి పట్టా పొందారు. తర్వాత సిఎ పూర్తి చేసి కంపెనీ సెక్రటరీ అర్హత సాధించారు. అనంతరం బెంగళూరు యూనివర్శిటీ నుండి న్యాయవిద్యలో పట్టా పొందారు. 1985 నుండి ఆయన న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. 1996 నుండి 2000 వరకూ ప్రభుత్వ న్యాయవాదిగానూ, 2000 జూలై నుండి 2004 మే నెల వరకూ అదనపు అడ్వకేట్ జనరల్గా వ్యవహరించారు. ఎన్టిఆర్ హెల్త్ యూనివర్శిటీ, వైజాగ్ పోర్టు, సింగరేణి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కెనరా బ్యాంకు, వోల్టాస్ తదితర సంస్థల తరఫున స్టాండింగ్ కౌనె్సల్గా సంచలన కేసులను వాదించారు. 2005 మే 26న ఆయన అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2006 ఫిబ్రవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి పొందారు. 2015 డిసెంబర్ 29 నుండి ఎపి లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు.